గడ్డి కోసేందుకు వెళ్లిన యువతిపై... కిరాతకంగా గ్యాంగ్ రేప్... చావు బతుకుల్లో బాధితురాలు...
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. హత్రస్ పట్టణానికి చెందిన ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార సమయంలో ఆమె ప్రతిఘటించడంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె శరీరంలో పలుచోట్ల ఫ్రాక్చర్స్ ఏర్పడ్డాయి. ఆమె నాలుక కూడా తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు ఏమంటున్నారు...
హత్రస్ ఎస్పీ విక్రాంత్ వీర్ కథనం ప్రకారం... ఈ నెల 14న ఆ యువతి తన తల్లి,సోదరుడితో కలిసి గడ్డి కోసుకొచ్చేందుకు పంట పొలాల వైపు వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ యువతి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె కోసం వెతగ్గా.. చాలాసేపటికి ఓచోట కనిపించింది. అప్పటికే ఆమె విషమ పరిస్థితిలో ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక ఆధారాలతో 20 ఏళ్ల సందీప్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు.
ఆరోజు అసలేం జరిగింది..
బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ... ఆరోజు మా అమ్మ,పెద్దన్న,సోదరి కలిసి గడ్డి కోసుకొచ్చేందుకు పొలం వద్దకు వెళ్లారు. కొద్దిసేపటికి కొన్ని గడ్డి మోపులను మోసుకుని పెద్దన్న ఇంటికొచ్చాడు. అమ్మ,సోదరి ఇంకా అక్కడే గడ్డి కోస్తూ ఉండిపోయారు. ఆ క్రమంలో ఒకరికొకరు కాస్త దూరంలోకి వెళ్లి గడ్డి కోస్తున్న సమయంలో... నలుగురైదుగురు వ్యక్తులు వెనక నుంచి మా సోదరిపై దాడి చేశారు. చున్నీని ఆమె మెడలో చుట్టి పొలాల్లోకి లాక్కెళ్లారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు
'కాసేపటికి తను కనిపించకపోవడంతో మా అమ్మ ఆమె కోసం వెతకడం మొదలుపెట్టింది. చివరకు ఓచోట అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. అప్పటికే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా మొదట వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. నాలుగైదు రోజుల తర్వాత గానీ వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు..' అని బాధితురాలి సోదరుడు చెప్పుకొచ్చారు. మరోవైపు హత్రస్ పోలీసులు మాత్రం తాము నిర్లక్ష్యంగా వ్యవహరించామన్న ఆరోపణలను ఖండించారు.
Recommended Video
చావు బతుకుల్లో బాధితురాలు
బాధితురాలు నిందితుల పేర్లు బయటపెట్టిన వెంటనే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. త్వరలోనే విచారణ పూర్తి చేస్తామని... దీనిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని జడ్జికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.అంతకుముందు,మెసిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో సందీప్,రాము,లవ్ కుష్,రవి అనే నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి వెల్లడించింది. వీళ్లంతా స్థానిక అగ్ర వర్ణాలకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అలీఘర్ జేఎన్ మెడికల్ కాలేజీలో ఆమె చికిత్స పొందుతోంది. అంతర్గతంగా తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించాల్సి వస్తుందన్నారు.