అరేబియన్ సముద్రంలో అల్పపీడన ద్రోణి..దక్షిణ రాష్ట్రాలకు వర్షసూచన
అరేబియన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి అది తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్లలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. తుఫానుగా మారిన తర్వాత ఒమన్ యెమెన్ తీరాలను దాటుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే తీరప్రాంతాలను నేవీ అలర్ట్ చేసింది. డ్రోన్లతో పరిస్థితిని సమీక్షిస్తోంది. కేరళ , లక్షద్వీప్ మినికాయ్ ద్వీపం, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో నౌకలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మోహరించి ఉన్నాయని నేవీ అధికారులు తెలిపారు. కాలం గడిచే కొద్దీ సముద్రం అల్లకల్లోలంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అధికారులు తెలిపారు. చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను తిరిగి తీరానికి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రానున్న 12 గంటల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది వాతావరణశాఖ
ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా మరో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని చెప్పిన అధికారులు ఇది క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిషా వైపు పయనిస్తుందని ఆ సమయంలో ఒడిషాలో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.