నేను జయలలిత, శోభన్ బాబుల కొడుకును: ఇదే సాక్ష్యం, మాయం, ఎంజీఆర్!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వివాహం కాకున్నా ఆమెకు తాను కుమారుడనని ఒకరు, తాను కుమార్తెనని మరొకరు కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులోని ఈ రోడ్ కు చెందిన క్రిష్ణమూర్తి తాను శోభన్ బాబు, జయలలితల కొడుకునంటూ మద్రాసు హైకోర్టులో కొన్ని పత్రాలు సమర్పించి మాయమయ్యాడు.
తాను శోభన్ బాబు, జయలలిత కుమారుడు అని చెప్పడానికి ఇవే సాక్ష్యాలు అంటూ కొన్ని పత్రాలను కోర్టుకు సమర్పించాడు. జయలలిత ఇంటికి ఎంజీఆర్ రావడం శోభన్ బాబుకు ఇష్టం లేదని, అందుకే తనను దత్తత ఇచ్చారని క్రిష్ణమూర్తి కోర్టులో వాదిస్తున్నాడు.
ఆ అగ్రిమెంట్ ఇదే !
శోభన్ బాబు, జయలలిత, తమిళనాడుకు చెందిన వసంత మణి కలిసి వారి ఫోటోలు అతికించి సంతకాలు చేసినట్లు ఉన్న ఓ కాగితాన్ని క్రిష్ణమూర్తి కోర్టులో సమర్పించాడు. శోభన్ బాబు, జయలలిత తనను వసంత మణికి దత్తత ఇచ్చే సమయంలో అగ్రిమెంట్ చేసుకున్నారని క్రిష్ణమూర్తి కోర్టులో వాదిస్తున్నాడు.
బాండ్ పేపర్ మీద
జయలలిత, శోభన్ బాబు తనను దత్తత ఇచ్చే సమయంలో వసంత మణికి బాండ్ పేపర్ మీద సంతకాలు చేసి ఇచ్చారని, ఆ బాండు పేపర్లో తాను జయలలిత కుమారుడు అనే విషయం స్పష్టంగా ఉందని క్రిష్ణమూర్తి తన న్యాయవాదితో కోర్టులో వాదిస్తున్నారు.
సోషల్ మీడియలో వైరల్
నేను శోభన్ బాబు, జయలలిత కుమారుడు అంటూ క్రిష్ణమూర్తి సమర్పించిన డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంటర్నెట్ లో జయలలిత, శోభన్ బాబు పాత పాస్ పోర్టు సైజు ఫోటోలు తీసుకుని ఇలా ఫోర్జరీ డాక్యూమెంట్లు తయారు చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
చిన్న పిల్లాడిని అడిగితే ?
కేసు విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి మహదేవన్ క్రిష్ణమూర్తి న్యాయవాదికి చివాట్లు పెట్టారు. ఈ డాక్యూమెంట్లు చూస్తే చిన్నపిల్లాడు అయినా అవి నకిలీ అని చెబుతారని, మీరు ఎలా కోర్టులో సమర్పించారని క్రిష్ణమూర్తి న్యాయవాదిని ప్రశ్నించారు.
జైలుకు పంపిస్తాం జాగ్రత్త !
తాను సమర్పించిన డాక్యూమెంట్లు పరిశీలించాలని క్రిష్ణమూర్తి తన న్యాయవాదితో కోర్టులో మనవి చేశాడు. ఇవి నకిలీ డాక్యూమెంట్లు అని తేలితే కచ్చితంగా జైలుకు పంపిస్తానని న్యాయమూర్తి మహదేవన్ క్రిష్ణమూర్తిని హెచ్చరించారు. కోర్టులో డాక్యూమెంట్లు సమర్పించిన క్రిష్ణమూర్తి ఇప్పుడు మాయం అయ్యాడు.