కూతురిపై తెగబడ్డ తండ్రి : రాత్రి ఆలస్యంగా వచ్చిందని..
న్యూఢిల్లీ : రాత్రివేళ ఇంటికి ఆలస్యంగా వచ్చిందన్న కారణంతో.. కూతురు అన్న విచక్షణ కూడా మరిచిపోయి ఆమెపై కత్తితో దాడి చేశాడో తండ్రి. ఈశాన్య ఢిల్లీలోని పాలం ప్రాంతం పరిధిలో ఉన్న రాజ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భవానీ శంకర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి రాజ్ నగర్ లో నివాసముంటున్నాడు. ఆయనకు 18 ఏళ్ల కూతురు ఉంది. కాగా, బయటకు వెళ్లిన కూతురు ఆలస్యంగా ఇంటికి రావడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన భవానీ శంకర్ కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె మెడ, భుజంపై గాయాలయ్యాయి.
ఘటన జరిగిన మరుసటి రోజు తండ్రి భవానీశంకర్ పై పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. తన మేనత్త ఇంటి నుంచి తిరిగొచ్చే క్రమంలో రాత్రి ఆలస్యమైందని చెబుతోంది బాధితురాలు. ఇక బాధిత యువతి ఫిర్యాదు మేరకు భవానీశంకర్ పై ఐపీసీ సెక్షన్ 323, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా డీసీపీ సురేంద్రకుమార్ చెప్పారు.