న్యాయశాఖ ఉన్నతాధికారికి సోకిన కరోనా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు శాస్త్రీభవన్లో ప్రకంపనలు.. సీల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్ మరింత వ్యాప్తిస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను రెడ్జోన్లుగా, కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించి.. కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ దాని పరిధి మాత్రం తగ్గట్లేదు. మరింత విస్తరించుకుంటూనే ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం శాస్త్రీభవన్కు పాకింది. న్యాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పని చేసే ఓ ఉన్నత ఉద్యోగి కరోనా వైరస్ బారిన పడ్డారు. దీనితో శాస్త్రీభవన్లోని ఓ అంతస్తును సీల్ చేశారు అధికారులు.
చివరిసారిగా ఆ అధికారి కిందటి నెల 23వ తేదీన న్యాయ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం తరువాత ఆయన తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, దగ్గుతో బాధపడ్డారు.
దీనితో ఆయనకు ఈ నెల 1వ తేదీన వైద్య పరీక్షలను నిర్వహించారు. ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు ఈ పరీక్షల్లో తేలింది. వైద్య పరీక్షకు సంబంధించిన నివేదిక అందిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన నివాసం ఉంటోన్న అంతస్తు మొత్తాన్నీ సీల్ చేశారు. తోటి ఉద్యోగులెవర్నీ బయట తిరగనివ్వలేదు.
ఇప్పటికే కరనా వైరస్ దాడి నేపథ్యంలో నీతి ఆయోగ్, సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. తాజాగా న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికి కూడా కరోనా సోకడంతో శాస్త్రీభవన్ను పాక్షికంగా సీల్ చేయాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆ ఉన్నతాధికారిని ఎవరెవరు కలిశారనే విషయంపూ అధికారులు ఆరా తీస్తున్నారు. కొందరికి వైద్య పరీక్షలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో న్యాయ మంత్రిత్వ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులకు కూడా వైద్య పరీక్షలను జరిపే అవకాశాలు లేకపోలేదు.