రైతంటే అంత చులకనా..! పలకరించడమే పాపమన్నట్టుగా..
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఆసరా లేకుండా అయిపోతుంది. ఏ ప్రభుత్వ పథకాలు అన్నదాతల ఆకలిని తీర్చలేకపోతున్నాయి. తీవ్ర కరువుతో దేశంలొని రైతులంతా అల్లాడుతున్న వేళ.. పరిస్థితికి అద్దం పడుతూ దేశ రాజధాని ఢిల్లీలో, ప్లకార్డు చేతబట్టిన ఓ రైతు తనకు సహాయం చేయాల్సిందిగా ఢిల్లీ రోడ్ల వెంబడి కనిపించిన ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాడు.
చిత్రంగా చాలామంది ఆ రైతును చూసీ చూడనట్టుగా వెళ్లిపోయారు తప్పిస్తే.. సహాయం కాదు కదా, కనీసం పలకరించే ప్రయత్నం కూడా ఎవరు చేయకపోవడం నిజంగా చింతించాల్సిన విషయం. దాదాపుగా 5 గంటల పాటు ఆ రైతు ఢిల్లీ రోడ్ల వెంట తిరిగితే.. అందరూ మాకెందుకు అన్నట్టుగానే రైతును దాటేసుకుంటూ వెళ్లిపోయారు. ఇక ఇండియా గేట్ వద్దనైతే అక్కడున్న పోలీసు బలవంతంగా రైతును అక్కడినుంచి పంపించేసే ప్రయత్నం చేశాడు.
కాగా.. కష్టాల్లో ఉన్న రైతుల పట్ల దేశ ప్రజలు ఏ మేరకు స్పందిస్తారో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, ప్రయోగాత్మకంగా ఈ ప్రయత్నం చేశారు. కానీ రైతుల పట్ల జనాలు ఎంత చిన్న చూపుతో వ్యవహరిస్తున్నారో ఈ ప్రయోగంతో తేలిపోయింది. కాలే కడుపులతో గ్రామాల నుంచి వలసబాట పడుతున్న రైతులు కొందరైతే.. ఏదో భరోసా రాకపోదా అని ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నవారు గ్రామాల్లో ఎంతోమంది. మరి ఇలాంటి రైతన్నలందరు సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందో..!