రిటైడ్జ్ దంపతులపై దాడి: నగలు లూటీ
మండ్య: రిటైడ్ జడ్జ్ పై దాడి చేసి ఇల్లు లూటీ చేసిన సంఘటన కర్ణాటకలోని మండ్య సమీపంలో జరిగింది. మద్రాస్ హై కోర్టు న్యాయమూర్తిగా పని చేసి రిటైర్ అయిన శివప్ప (80) ఆయన భార్య విజయలక్ష్మి (70) తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మండ్య జిల్లాలోని పాండవపుర తాలుకా పట్టసోమనహళ్ళి సమీపంలో శ్రీశైల శ్రీ కామాక్షి చంద్రమౌళి దేవాలయం సమీపంలో శివప్ప, ఆయన భార్య నివాసం ఉంటున్నారు. రాత్రి సుమారు 10 మంది దుండగులు శివప్ప ఇంటి దగ్గరకు వెళ్లారు.
కిటికి డ్రిల్స్ కత్తిరించి లోపలకి చోరబడ్డారు. అడ్డుకున్న శివప్ప, ఆయన భార్య విజయలక్ష్మి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. తరువాత విజయలక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం, కమ్మలు, లాకర్ లో ఉన్న రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చేశారు.
తరువాత శివప్ప దంపతుల మీద దాడి చేసిన నిందితులు అక్కడి నుంచి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. గాయాలైన శివప్ప దంపతులను ఆసుపత్రికి తరలించారు.