ప్రధాని నరేంద్ర మోడీ స్కీమ్ గిన్నిస్ రికార్డ్లకెక్కింది
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డ్ సృష్టించారు! సామాజిక అనుసంధాన వెబ్సైట్లలో నరేంద్ర మోడీ ఎప్పుడు ముందంజలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రారంభించిన పథకం గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. మోడీ ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇది రికార్డ్ నెలకొల్పింది. ఈ పథకం కింద తక్కువ సమయంలో గరిష్ట సంఖ్య బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఐదు నెలల్లో 11.5 కోట్ల బ్యాంకు ఖాతాలను ఈ పథకం కింద తెరిచారు. ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. గిన్నిస్ అధికారులు ఈ పథకానికి సర్టిఫికేట్ జారీ చేశారు.
గత ఏడాది ఆగస్టు 28వ తేదీన ఈ పథకం ప్రారంభమైంది. జనవరి 26వ తేదీ కల్లా 7.5 కోట్ల మందిని ఈ పథకం కిందకు తీసుకు రావాలనుకున్నారు. అయితే, అతి తక్కువ వ్యవధిలోనే అంచనాలకి మించి చేరుకుంది.
ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. తాము కేవలం గ్రామాలను లక్ష్యంగా పెట్టుకోలేదని, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జన్ ధన్ యోజన కింద 11.5 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారని, దీంతో 99.74 శాతం కుటుంబాలు జన్ ధన్ యోజన పరిధిలోకి వచ్చాయన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఇక నుండి 300 జిల్లాల్లో లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నగదు బదలీ చేస్తామని చెప్పారు.