ఇదేం పిచ్చి: శ్రీరాముడికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరట
దేవుళ్ల పై రోజురోజుకు వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. కొన్ని రోజుల క్రితం హనుమంతుడు దళితుడు అంటూ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత హనుమంతుడు ముస్లిం సామాజిక వర్గానికి చెందినవాడంటూ మరో బీజేపీ ఎమ్మెల్యే బుక్కల్ నవాబ్ చెప్పుకొచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మరో బీజేపీ మంత్రి లక్షీనారాయణ చౌదరి హనుమంతుడు జాట్ సామాజిక వర్గానికి చెందిన వాడంటూ కామెంట్ చేశారు. తాజాగా ఇదే కమలం పార్టీకి చెందిన మరో ప్రజాప్రతినిధి హరినారాయణ్ రాజ్భర్ రాముడికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇళ్లును మంజూరు చేయాలని వ్యాఖ్యానించారు.
అయోధ్యలో రాముడి విగ్రహం ఒక టెంటు కింద ఉందని చెప్పిన ఘోషీ ఎంపీ హరినారాయణ్ రాజ్భర్... వెంటనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద శ్రీరాముడికి ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు చలికాలంలో, ఎండాకాలంలో వర్షాకాలంలో రాముడు బయటే సేదతీరడం తనను కలచివేస్తోందని రాజ్ భర్ చెప్పాడు. ఇళ్లు లేనివారికి కేంద్ర ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తోందని చెప్పిన రాజ్భర్... రాముడికి కూడా ఇళ్లు లేదని జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రాముడికి ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులకు హరినారాయణ్ రాజ్భర్ లేఖ రాశారు.
ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అయోధ్యలోని రామమందిర నిర్మాణ అంశం ప్రధాన వార్తగా నిలుస్తోంది. రామ మందిరం నిర్మించి తీరాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని బీజేపీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. అంతేకాదు ఆర్ఎస్ఎస్కూడా రామమందిర నిర్మాణంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోంది. రామమందిరం నిర్మాణంకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్ఎస్ఎస్, శివసేన, వీహెచ్పీలాంటి సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం మౌనం వహిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది.
ఈ మధ్యకాలంలో బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో కూడా రామమందిర నిర్మాణం చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే రామమందిర నిర్మాణం కావాలనుకునేవారు కాస్త ఓపికతో ఉండాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.