ముగ్గురి వేధింపులు: టీవీ యాంకర్ ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: ఓ టీవీ ఛానల్ న్యూస్ యాంకర్ ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆత్మహత్యాయత్నం చేసిన టీవీ యాంకర్ వయస్సు 24. ఈమె ఛానల్ ప్రధాన ద్వారం వద్ద విషం తాగింది. ఈ ఘటన నోయిడాలో జరిగింది. ఆమెను నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. నోయిడా పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను ఆదివారం సాయంత్రం రికార్డ్ చేశారు. కేసు నమోదు చేశారు. ఛానల్కు చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సంఘటన ఆదివారం ఉధయం చోటు చేసుకుంది. తనను లోనికి వెళ్లకుండా ఆపడంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ప్రాథమిక విచారణలో తేలింది.
ఛానల్ లోని కొందరు తన పట్ల ద్రోహానికి, కుట్రకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తనను ముగ్గురు సీనియర్ అధికారులు వేధిస్తున్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వేధించిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు తనను మానసికంగా వేధిస్తున్నారని, తన పైన కుట్ర చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
తనను వేధిస్తున్న విషయమై ఆ టీవీ యాంకర్ ఓ సహోద్యోగికి మెసేజ్ చేస్తూ.. తాను రాజీనామా చేస్తున్నట్లు సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ చేశారట. ఇది పలువురికి పాస్ అయింది. దీంతో ఆమెను తీసేశారట. ఓ టెక్స్ట్ మెసేజ్ ఆధారంగా తనను ఎలా తొలగిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.