వీడియో: మీ మాటలకేం గానీ.. కాశ్మీర్లో అసలు సమస్య ఉందంటూ లెక్చర్ దంచిన మందుబాబు!
Recommended Video
శ్రీనగర్: ఇల్లు కాలిపోయి ఒకడు ఏడుస్తోంటే.. బీడి అంటించుకోవడానికి నిప్పడిగినట్టుంది ఓ కాశ్మీరీ యువకుడి పరిస్థితి. స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల చెలరేగిన రాజకీయ ప్రకంపనలతో జమ్మూ కాశ్మీర్ అట్టుడికిపోతోంటే- ఓ యువకుడు మాత్రం ముందు.. తన సమస్యను తీర్చమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ లోని అనేక ప్రాంతాలు ఓ కీలక సమస్యను ఎదుర్కొంటున్నాయని, వాటిని పరిష్కరించకుండా ఆర్టికల్ 370ని రద్దు చేయడం, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం వల్ల ఒరిగేదేమీ ఉండదని పెదవి విరుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా దుమ్ము దులుపుతోంది. వైరల్ గా మారింది.
మొన్నటిదాకా కరవు..ఇప్పుడు ముంచేస్తోన్న వరదలు: దేనికి సంకేతం?
ఆ యువకుడి పేరు తెలియట్లేదు గానీ.. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ కు చెందిన వాడిగా చెప్పుకొంటున్నాడు. అతని అసలు సమస్య-మందు. భద్రతా కారణాల వల్ల కావచ్చు, రవాణా సమస్య వల్ల కావచ్చు గానీ అనంతనాగ్ లో ఒక్క మద్యం షాపు కూడా లేదు. అదే అతనికి పెద్ద చిక్కు తెచ్చి పెట్టిందట. మద్యం షాపు ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను పడుతున్నామని చెబుతున్నాడు. ఇది తన ఒక్కడి సమస్య మాత్రమే కాదని, జిల్లా మొత్తం ఎదుర్కొంటున్న ఇబ్బందని అంటున్నాడు. ఒక్క మద్యం బాటిల్ కొనాలంటే.. శ్రీనగర్ దాకా వెళ్లాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నామని వాపోతున్నాడా మందుబాబు.
శ్రీనగర్ వెళ్లి రావడానికి 500 రూపాయలకు పైగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాడు. అనంతనాగ్ లో మందు బాటిల్ దొరికినా రెట్టింపు రేట్లకు బ్లాక్ లో కొనాల్సిన పరిస్థితి ఉందట. 250 రూపాయలకు శ్రీనగర్ లో ఓ మందు బాటిల్ ను కొనుగోలు చేసి.. 500 రూపాయలకు అనంత నాగ్ లో అమ్ముకుంటున్నారని, ఈ పరిస్థితుల్లో దాన్ని కొని మనస్ఫూర్తిగా తాగలేని పరిస్థితి ఉందని అంటున్నాడు. నరేంద్ర మోడీపై తనకు విశ్వాసం ఉందని, త్వరలోనే అనంతనాగ్ లో మద్యం షాపును ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నానని ముక్తాయింపునిచ్చాడు. ఈ కీలక సమస్యను పరిష్కరించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, కఠిన చర్యలు చేపట్టినా పెద్దగా ఉపయోగం ఉండబోదని ఆ మందుబాబు ఏకంగా నరేంద్ర మోడీకే హితబోధ చేశాడు.