జయ మరణం: అపోలో ప్రతాప్ సీ రెడ్డిపై క్రిమినల్ కేసుకు డిమాండ్, ఫిర్యాదు
అపోలో ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డిపై తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలు తొలగిపోవాలంటే ఆమెకు 75 రోజులపాటు చికిత్స.
చెన్నై: అపోలో ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డిపై తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలు తొలగిపోవాలంటే ఆమెకు 75 రోజులపాటు చికిత్స అందించిన చెన్నై అపోలో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరపాలని దిండిగల్ జిల్లా వర్థమాన సామాజిక న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సెబాస్టియన్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు దిండిగల్ ఎస్పీకి ఆయన ఓ ఫిర్యాదు పత్రం అందజేశారు. ఆ ఫిర్యాదులో జయ అపోలో ఆస్పత్రిలో చేరి 75 రోజులపాటు చికిత్స పొందినా ఫలితం లేకపోయిందని, చివరకు ఆమె మృతదేహమే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిందన్నారు.
ఆ ఆస్పత్రిలో జయకు చేసిన చికిత్సల వివరాలు ఒకదానితో ఒకటి పొంతనలేనివిగా వున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డిపైనా, ఆయనకు సహకరించిన వైద్యులపైనా కేసులు నమోదుచేసి విచారణ జరపాలని, అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని సెబాస్టియన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చెన్నై అపోలో ఆస్పత్రిలో 75రోజులపాటు చికిత్స పొందిన జయలలిత ఆస్పత్రిలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రమైన గుండెపోటు రావడంతోనే ఆమె మృతి చెందిందని ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. తాము ఏ విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.