గెలుపెవరిది? అసోంలో బీజేపీ: ఏ సర్వే ఏంచెబుతోంది?
ఢిల్లీ: ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి షాక్, బీజేపీకి కొంత ఊరటనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే, జయలలితకు షాక్ తగలనుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేరళ, అసోంను కోల్పోనుంది. అసోంలో కమలం వికసించనుంది.
పశ్చిమ బెంగాల్లో మరోసారి మమతా బెనర్జీ అధికారంలోకి రానున్నారు. ఈశాన్యంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుంది. కేవలం పశ్చిమ బెంగాల్లో మాత్రమే అధికార మార్పిడి జరిగే అవకాశం లేదని ఎగ్జిట్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరగనుంది.
ఓట్ల లెక్కింపు ఈ నెల 19వ తేదీ జరగనుంది. అసోంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తరుణ్ గొగోయ్ సర్కారుకు కాలం చెల్లినట్లేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బిజెపి కూటమికే ఇక్కడ అధికారం లభిస్తుందని అన్ని సర్వేలు ముక్తకంఠంతో చెప్పాయి.
తరుణ్ గొగోయ్పై తిరుగుబావుటా ఎగరేసిన హిమంత బిస్వా కారణంగా కాంగ్రెస్కు పరాజయం తప్పడం లేదనీ, స్థానిక నేత సర్బానంద సోనోవాల్ను భాజపా తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కమలనాథులకు కలిసి వచ్చిందనీ సర్వేలు చెబుతున్నాయి.
ఏ సర్వేలు ఎం చెబుతున్నాయి?
తమిళనాడులో.. అన్నాడీఎంకేకు 89, డీఎంకేకు 124, డీఎండీకేకు 0, ఇతరులకు 4 సీట్లు వస్తాయని ఇండియా టుడే తెలిపింది. అన్నాడీఎంకేకు 95 నుంచి 99, డీఎంకేకు 114-118, డీఎండీకేకు 14, ఇతరులకు 9 సీట్లు వస్తాయని న్యూస్ నేషన్ తెలిపింది. అన్నాడీఎంకేకు 139, డీఎంకేకు 78, డీఎండీకేకు 0, ఇతరులకు 17 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ, సీ ఓటరు తెలిపింది.
పుదుచ్చేరిలో.. అన్నాడీఎంకేకు 1-4 సీట్లు, డీఎంకే, కాంగ్రెస్ మిత్రపక్షానికి 15-21, ఏఐఎన్ఆర్సీకి 8-10, ఇతరులు 0-2 వరకు వస్తాయని యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది. అన్నాడీఎంకేకు 5 సీట్లు, డీఎంకే, కాంగ్రెస్ మిత్రపక్షానికి 14, ఏఐఎన్ఆర్సీకి 9, ఇతరులు 2 వరకు వస్తాయని టైమ్స్ నౌ సీ ఓటరు సర్వే తెలిపింది.
పశ్చిమ బెంగాల్లో... తృణమూల్కు 178, వామపక్షాలు 110, బీజేపీ 1, ఇతరులు 5 గెలుస్తారని ఏపీబీ - ఆనందా సర్వే తెలిపింది. తృణమూల్కు 233-253, వామపక్షాలు 38-51, బీజేపీ 1-5, ఇతరులు 2-5 గెలుస్తారని ఇండియా టుడే - యాక్సిస్ సర్వే తెలిపింది.
తృణమూల్కు 163-171, వామపక్షాలు 71-79, బీజేపీ 2-6, ఇతరులు 1-5 గెలుస్తారని ఇండియా టీవీ సీ ఓటర్ సర్వే తెలిపింది. తృణమూల్కు 196, వామపక్షాలు 92, బీజేపీ 3, ఇతరులు 5-5 గెలుస్తారని ఎన్డీటీవీ సర్వే తెలిపింది.
కేరళలో.. ఎల్డీఎప్ 94, యూడీఎఫ్ 43, బీజేపీ 1, ఇతరులు 2 సీట్లు గెలిచే అవకాశముందని ఇండియా టుడే చెప్పింది. ఎల్డీఎప్ 69, యూడీఎఫ్ 70, బీజేపీ 1, ఇతరులు 0 సీట్లు గెలిచే అవకాశముందని న్యూస్ నేషన్ చెప్పింది.
ఎల్డీఎప్ 78, యూడీఎఫ్ 43, బీజేపీ 4, ఇతరులు 2 సీట్లు గెలిచే అవకాశముందని ఇండియా టీవీ చెప్పింది. ఎల్డీఎప్ 78, యూడీఎఫ్ 58, బీజేపీ 2, ఇతరులు 2 సీట్లు గెలిచే అవకాశముందని టైమ్స్ నౌ, సీ ఓటరు చెప్పింది.