గుర్మీత్ ఖతమ్: ఇక నిత్యానంద స్వామి వంతు
బెంగుళూరు: అత్యాచారం కేసులో డేరాబాబా గుర్మీత్ రాంరహీమ్ సింగ్కు 20 ఏళ్ళపాటు జైలు శిక్ష పడిన నేపథ్యంలో మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందస్వామి వ్యవహరం మరోటి వెలుగుచూసింది.ఆశ్రమంలో సేవకురాలిగా ఉన్న తనపై నిత్యానంద అత్యాచారానికి పాల్పడ్డారని ఏడేళ్ళ క్రితం రామ్నగర్ పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు ఓ బాధితురాలు తెలిపారు.
ఐదేళ్ళపాటు నిత్యానంద తనపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడని అమెరికాకు చెందిన మహిళ గతంలోనే పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ విషయమై అప్పటి ముఖ్యమంత్రి సదానందగౌడ తీవ్రంగా స్పందించారు. నిత్యానందను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
తనను మానసికంగా, శారీరకంగా వేధించినట్టుగా 2010 నవంబర్లో తాను ఫిర్యాదు చేస్తే తనపై మరుసటి నెలలోనే తప్పుడు ఫిర్యాదులను తనపై చేశారని బాధితురాలు తెలిపారు. డేరాబాబా ఆస్తులను స్వాథీనం చేసుకొన్నట్టుగానే నిత్యానంద ఆస్తులను కూడ స్వాధీనం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
బాధిత మహిళలు ఐక్యంగా పోరాటం నిర్వహిస్తే నిత్యానంద బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని బాధిత మహిళ అభిప్రాయపడ్డారు.తన ఆశ్రమంలో కూర్చోని వ్యాపార, వినోదాత్మక, ఇతరత్రా కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక మంది అమాయకులను మోసం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.
బెంగుళూరులోనే కాదు దేశంలోని అన్ని ఆశ్రమాల్లో తన సేవకులుగా తీసుకొన్న మహిళలను వారి తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేస్తారని చెప్పారు. నిత్యానంద ఆశ్రమంలో చేరితే తమ స్వంత ఉనికిని కోల్పోతారని బాధితురాలు చెప్పారు. సేవకుల మైండ్సెట్ను నిత్యానంద మార్చివేస్తారని ఆమె చెప్పారు.