గుడ్డిగా నమ్మేశాడు: 'ప్రేమ' కోసం మర్మాంగం కోసేసుకున్నాడు..
స్నేహితులు చెప్పింది నిజమేననుకుని నమ్మిన బిజుకుమార్ర అమ్మవారికి తన నాలుకను, మర్మాంగాన్ని కానుకగా సమర్పించాడు.
కృష్ణరాజపుర: ప్రేమించడంలో తప్పులేదు గానీ ఆ ప్రేమ కోసం మూర్ఖత్వంగా వ్యవహరిస్తే బలైపోయేది తమ జీవితమేనన్న స్పృహ ఉండాలి. ఒడిశాకు చెందిన ఒక యువకుడు ప్రేమను దక్కించుకోవడం కోసం ఏకంగా తన మర్మాంగాన్నే కోసేసుకున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. అతనే స్వయంగా నిజం ఒప్పుకోవడంతో విన్నవాళ్లకు ఈ విషయం విస్మయం కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన బిజుకుమార్ అనే యువకుడు అతని గ్రామానికే చెందిన ఒక యువతిని కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే యువతి మాత్రం బిజుకుమార్ ప్రేమను తిరస్కరిస్తూ వస్తుంది. తన ప్రేమకు ప్రేయసి 'నో' చెప్పడంతో తాగుడుకు బానిసయ్యాడు.
బిజుకుమార్ ప్రవర్తనలో మార్పు రావాలని ఆశించిన తల్లిదండ్రులు అతన్ని మేనమామ వద్దకు పంపించారు. దీంతో బెంగుళూరులోని ఇమ్మడిహళ్లిలో ఉండే మేనమామ వద్దకు బిజుకుమార్ వెళ్లాడు. అక్కడ కొంతమంది బెంగాల్ యువకులతో అతనికి పరిచయం ఏర్పడింది. దీంతో తన ప్రేమ వ్యవహారం గురించి వారికి పూర్తిగా వివరించాడు.
ప్రేమ సమస్య పరిష్కారం కోసం వాళ్లు ఒళ్లు గగుర్పొడిచే సలహా ఇచ్చారు. అమ్మవారికి నాలుకతో పాటు మర్మాంగాన్ని కానుకగా సమర్పిస్తే.. వశీకరణ శక్తి సిద్దిస్తుందని, తద్వారా ప్రేమించిన యువతి వశం అవుతందని నమ్మబలికారు. ఇది నిజమేననుకుని నమ్మిన బిజుకుమార్ర అమ్మవారికి తన నాలుకను, మర్మాంగాన్ని కానుకగా సమర్పించాడు.
ఇంత చేసినా.. తనకెటువంటి వశీకరణ శక్తులు సిద్ధించకపోవడంతో అతనిలో వణుకు మొదలైంది. అయితే విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక.. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి నాలుకతో పాటు మర్మాంగం కోసేశారని కట్టుకథ అల్లాడు. దీంతో బిజుకుమార్ మామయ్య అతన్ని ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం ఒప్పేసుకున్నాడు. ప్రేమించిన యువతి కోసం తానే ఇలా చేశానని అంగీకరించాడు. బిజుకుమార్ చెప్పిన నిజం విని అక్కడున్నవాళ్లంతా షాక్ తిన్నారు.