ఉద్యోగమైనా ఇవ్వండి... లేదా పిల్లను చూసి పెళ్లి చేయండి... సీఎంకు లేఖ యువకుడి లేఖ వైరల్...
ఈరోజుల్లో ఉద్యోగం లేని యువకులకు పిల్ల దొరకడం కష్టం. ఓవైపు పెరిగిన కాంపిటిషన్... మరోవైపు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో.. చాలామంది యువకులు పెళ్లి కాని ప్రసాద్లుగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మహారాష్ట్ర యువకుడు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉద్యోగమైనా ఇవ్వండి.. లేదా పిల్లను చూసి పెళ్లి చేయండి అంటూ సీఎంకి రాసిన లేఖలో ఆ యువకుడు పేర్కొనడం గమనార్హం.
వషీం జిల్లాకు చెందిన గజానన్ రాథోడ్ అనే యువకుడు ఈ లేఖ రాశాడు. 'నా వయసు 35 ఏళ్లు. ఇంత వరకు నాకు పెళ్లి కాలేదు. దీనికి కారణం నాకింకా ఉద్యోగం దొరక్కపోవడమే. ఇప్పటివరకూ నేను ఏడు సార్లు ఉద్యోగం కోసం ప్రిపేరై పరీక్షలు రాశాను, కానీ చాలా తక్కువ మార్కులతో ఉద్యోగం కోల్పోయాను.పెళ్లి కోసం పిల్లను చూసేందుకు వెళ్లినప్పుడల్లా ఉద్యోగం ఉండాలన్న షరతు విధిస్తున్నారు. ఇలాంటి సమయంలో మీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇంకా ఎలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. దీంతో ఉద్యోగంతో పాటు పెళ్లి కోసం పిల్ల దొరకడం గగనమైపోయింది. కాబట్టి నాకు జాబ్ అయినా ఇవ్వండి లేనిపక్షంలో పిల్లను చూసి పెళ్లయినా చేయండి.' అని గజానన్ సీఎం ఉద్దవ్ థాక్రేకి రాసిన లేఖలో చెప్పుకొచ్చాడు.
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలో ఎంతోమంది యువకులు ఉద్యోగ,ఉపాధి కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లీడుకు వచ్చిన చాలామంది యువకులు ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఉద్యోగం వున్న యువకుల వైపు మొగ్గుచూపుతుండటంతో ఉద్యోగం లేని అబ్బాయిలకు పెళ్లిళ్లు కష్టమైపోయాయి. ఈ నేపథ్యంలో గజానన్ రాసిన లేఖ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
గతంలోనూ ఇలాంటి లేఖలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు తనను ఒక రోజు ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ.. రాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారికి లేఖ రాశాడు. తనను ముఖ్యమంత్రిని చేస్తే మరాఠ్వాడాలోని సమస్యలన్నింటినీ పరిష్కస్తానని చెప్పుకొచ్చాడు. అతని లేఖ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.