ఎమ్మార్వో కార్యాలయానికి పెట్రోల్తో తండ్రీకూతుళ్లు... సిద్దిపేటలో కలకలం...
సిద్దిపేట జిల్లా కోహెడ తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. పెట్రోల్ డబ్బాలతో కార్యాలయంలోకి వెళ్లిన తండ్రీకూతుళ్లు తలుపులు మూసి ఆత్మహత్య చేసుకుంటామని నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగితేనే అక్కడినుంచి కదులుతామని లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పోలీసులు రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో వారు శాంతించినట్లు తెలుస్తోంది.
కోహెడ మండలం చెంచల చెరువులపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతి రెడ్డికి ఎకరం 30 గుంటల భూమి ఉంది. 2011లో ఆ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే మ్యుటేషన్ కోసం ఎన్నిసార్లు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవట్లేదని తిరుపతి రెడ్డి,స్వరూప ఆరోపిస్తున్నారు.
ఇదే క్రమంలో ఇటీవల ఆ భూమికి సంబంధించిన పహాణీలో తన తండ్రి పేరును తొలగించి వేరే వాళ్ల పేరు మీద భూమిని రిజిస్టర్ చేయించినట్లు గుర్తించామన్నారు. దీనిపై గతంలో ఉన్న ఎమ్మార్వోని,ఇప్పటి ఎమ్మార్వోని సంప్రదిస్తే... భూమి వద్దకు వచ్చి తనిఖీ చేశాక తిరిగి తమ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారన్నారు. అయితే మాటలే తప్ప ఎన్నిసార్లు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా లాభం లేదన్నారు.
మరోవైపు,వేరే వ్యక్తి తమ భూమిని సాగు చేసుకుంటున్నాడని... పోలీసుల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుందామని పెట్రోల్ డబ్బాలతో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఇకనైనా తమకు న్యాయం చేయాలని కోరారు.
గత నెలలో ఇదే సిద్దిపేట జిల్లాలో తన భూమిని పట్టా చేయట్లేదని ఓ దళితుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వర్గల్ మండలం,వేలూరు గ్రామానికి చెందిన బ్యాగరి నరసింహులు అనే ఆ వ్యక్తి తన 13 గుంటల భూమిని పట్టా బుక్లో చేర్చాలని ఎన్నోసార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా లాభం లేకపోయింది. పైగా అదే భూమిని రైతు వేదిక నిర్మాణానికి ఇవ్వాలని అధికారులు బలవంతం చేస్తుండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.