రైలులో ఘోరం: భార్య కోసం సీటు అడిగితే.. భర్తను కొట్టిచంపారు
పుణె: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్లో సీటు కోసం జరిగిన వివాదంలో 26 ఏళ్ల వ్యక్తిని 12 మంది కొట్టిచంపారు. నిందితుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. ముంబై-లాతుర్ ఎక్స్ప్రెస్ రైలులో చోటు చేసుకుంది.
పాపను ఎత్తుకున్న భార్య కోసం సీటు అడిగాడు..
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం కళ్యాణ్ ప్రాంతానికి చెందిన సాగర్ మార్కండ్ అనే వ్యక్తి తన భార్య జ్యోతి, రెండేళ్ల కుమార్తెతో కలిసి షోలాపూర్ జిల్లాలోని కుర్దువాడి వెళ్లేందుకు కళ్యాణ్లో రైలు ఎక్కాడు. జనరల్ బోగీలో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో కూతుర్ను ఎత్తుకున్న తన భార్య కూర్చునేందుకు సీటు సర్దుబాటు చేసుకోవాలని కూర్చున్న మహిళలను కోరాడు.
ఒక్కసారిగా 12 మంది దాడి చేశారు.. గంటపాటు
అయితే, ఇందుకు అంగీకరించని మహిళలు సాగర్తో వాగ్వివాదానికి దిగారు. ఆ తర్వాత ఈ వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో సదరు మహిళలతోపాటు 12 మంది కలిసి సాగర్ను తోసివేశారు. ఆ తర్వాత తీవ్రంగా కొట్టారు.
గంటపాటు తీవ్రంగా కొట్టారు..
సాగర్ భార్య వారిని వారిస్తున్నా వినకుండా సుమారు గంటపాటు అతడ్ని తీవ్రంగా కొట్టారు. రైలు పుణె నుంచి తర్వాతి స్టేషన్ దౌండ్ చేరుకునే వరకూ కొడుతూనే ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దౌండ్ స్టేషన్లో సాగర్ను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆస్పత్రిలో సాగర్ మృతి.. నిందితుల అరెస్ట్
ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీటు ఇవ్వమన్నందుకే తన భర్తను నిందితులంతా కలిసి కొట్టి చంపారని సాగర్ భార్య కన్నీటిపర్యంతమైంది. కుటుంబ ఆధారాన్ని కోల్పోయామని వాపోయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది.