ప్రియుడి మోజులో నంది హిల్స్ లో భర్తను చంపిన భార్య, పెట్రోల్ పోసి నిప్పంటించి, చివరికి !
బెంగళూరు: ప్రియుడి వ్యామోహంలో భర్తను దారుణంగా హత్య చేసిన మహిళను కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పోలీసులు అరెస్టు చేశారు. భర్తను హత్య చేసిన మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశామని చిక్కబళ్లాపురం జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి శనివారం మీడియాకు చెప్పారు.
బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్లాపురం తాలుకాలోని లఘమేనహళ్ళికి చెందిన లక్ష్మి, చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూరు తాలుకా మంచేనహళ్ళికి చెందిన వెంకటేశ్ కు 8 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. లక్ష్మికి అంతకు ముందే నాగరాజ్ అనే ప్రియుడు ఉన్నాడు.
వివాహం అయిన తరువాత లక్ష్మి నాగరాజ్ తో అక్రమ సంబంధం కొనసాగించింది. ఈ విషయం తెలిసిన వెంకటేశ్ భార్య లక్ష్మిని పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా లక్ష్మిలో ఎలాంటి మార్పురాలేదు. విసిగిపోయిన వెంకటేశ్ భార్య లక్ష్మిని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు.
తన అక్రమ సంబంధానికి భర్త వెంకటేశ్ అడ్డుగా ఉన్నాడని లక్ష్మి రగిలిపోయింది. 2018 జులై 28వ తేదీన భర్త వెంకటేశ్ కు మాయమాటలు చెప్పిన లక్ష్మి అతన్ని ప్రసిద్ది చెందిన నంది హిల్స్ కు పిలుచుకుని వెళ్లింది. తరువాత ప్రియుడు నాగరాజ్ తో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
నంది హిల్స్ లోని బసవణ్ణ గుడి సమీపంలోని అటవి ప్రాంతంలో భర్త వెంకటేశ్ ను ప్రియుడు నాగరాజ్ తో కలిసి పెట్రోల్ పోసి తగలబెట్టింది. విషయం తెలుసుకున్న నంది హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకిలేని మనుషుల వివరాలను పోలీసులు సేకరించారు.
వెంకటేశ్ కనిపించడం లేదని తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు. లక్ష్మి మీద అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా భర్త వెంకటేశ్ ను హత్య చేసినట్లు అంగీకరించిందని, ఆమెతో పాటు నాగరాజ్ ను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి మీడియాకు చెప్పారు.