వీడియో: వందే భారత్ రైలు ఎక్కబోతున్నారా- జర భద్రం: ఈ పని అస్సలు చెయ్యొద్దు..!!
వందే భారత్ రైలు ఎక్కబోయి ప్రమాదానికి గురైన ప్రయాణికుడిని రక్షించిన ఆర్పీఎఫ్ సిబ్బంది: పశ్చిమ బెంగాల్ లోని మాల్దా స్టేషన్ లో ఘటన
న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్న అంశం- వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు. పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లు పట్టాలెక్కాయి. ఇప్పటివరకు ఎనిమిది రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే గరిష్ఠంగా మూడింతల వేగంతో- పరుగులు పెడుతోండటంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్నాయి ఇవి.
జనాదరణతో..
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. వాటి వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంటోంది. ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు.
ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ తో జరభద్రం..
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వందే భారత్ రైలుకు ఉన్నవన్నీ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్. వాటంతటవే తెరచుకుంటాయి. వాటంతట అవే క్లోజ్ అవుతాయి. నిర్దేశిత సమయం పూర్తి కాగానే మళ్లీ మూసుకుంటాయి.
స్టేషన్ నుంచి కదలడానికి ముందుగానే ఈ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ క్లోజ్ అవుతాయి. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థ మెట్రో రైలులో మాత్రమే అందుబాటులో ఉంది. డోర్ మూసుకోకపోతే అక్కడే ఉన్న గ్రీన్ బటన్ ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రయాణికులకు.
ఆ ప్రయత్నం చేయొద్దు..
సాధారణ రైళ్లు ప్లాట్ ఫామ్ వదలడానికి ముందు రన్నింగ్ లో ఎక్కే అవకాశం ఉంది. సాధారణ రైళ్ల డోర్స్ మ్యానువల్ గా ఆపరేట్ చేసేవి కావడం వల్ల ఆ ఇబ్బంది ఉండదు. వందే భారత్ రైలు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. రైలు కదలడానికి ముందే డోర్స్ క్లోజ్ అవుతాయి. ఒక్కసారి అవి మూసుకుపోయాయంటే ఇక మళ్లీ దాన్ని తెరవడం అసాధ్యం. తరువాతి స్టేషన్ వచ్చేంత వరకూ అవి తెరచుకోవు.
రన్నింగ్ లో ఎక్కబోతూ..
ఈ విషయం తెలుసు, తెలియదో గానీ- ఓ ప్రయాణికుడు వందే భారత్ రైలును రన్నింగ్ లో ఎక్కబోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. మూసుకుపోయిన తలుపులను రన్నింగ్ లోనే తెరవడానికి ప్రయత్నించాడు. కాలు జారి రైలు- ప్లాట్ ఫామ్ మధ్య ఉన్న గ్యాప్ లో పడిపోయాడు. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ సిబ్బంది, తోటి ప్రయాణికులు అతణ్ని సకాలంలో కాపాడగలిగారు. కిందపడ్డ వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రయాణికులు మెరుపులా కదిలి, అతణ్ని బయటికి తీయగలిగారు.
మాల్దా స్టేషన్ లో..
పశ్చిమ బెంగాల్ లోని మాల్దా స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతణ్ని మాల్దాకు చెందిన శివశంకర్ బెనర్జీగా గుర్తించారు. ఇదంతా స్టేషన్ ప్లాట్ ఫామ్ పై అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీనికి సంబంధించిన ఫుటేజీని ఆర్పీఎఫ్ అధికారులు తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. కదిలే రైలును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కే, దిగే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అది ప్రాణాంతకమని హెచ్చరించారు.