భార్యను కాపురానికి పంపకపోతే బాంబులు పేల్చుకుని చస్తా...! భర్త వింత ఆందోళన
దేశంలో భార్య బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. గతంలో తమ భర్తలు కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ మహిళల ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి...కాని కాలం మారింది. ఇప్పుడు భర్తలే, భార్య బాధితులవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే తమ భార్యలను కాపురానికి పంపించాలని భర్తలు అత్తవారి ఇంటి ముందు ఆందోళనలు చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.
తాజాగా తమిళనాడుకు చెందిన ఓ భార్య బాధితుడు విచిత్రమైన ఆందోళనకు దిగాడు. తన భార్యను కాపురానికి పంపించండి అంటూ తన ఒళ్లంతా నాటు బాంబులు చుట్టుకున్నాడు. దీంతో పాటు చేతిలో కిరోసిన్ డబ్బా సైతం పట్టుకుని అత్తింటి ముందు బైఠాయించాడు. అల్లుడి ఆందోళనతో భార్య కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటన స్థలానికి చేరుకన్న పోలీసులు భార్యభాధితుడికికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.. అయితే ట్విస్ట్ ఏమిటంటే పోలీసుల కౌన్సిలింగ్తో శాంతించిన వ్యక్తి ఈ రెండింటితో పాటు విషం కూడ తాగనని చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడుకు చెందిన మణికందన్ తన భార్యతో గోడవల కారణంగా ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నాడు. ఆయనకు ఓ కుమారుడు కూడ ఉన్నాడు. ఇక భార్యభర్తల వివాదానికి సంబంధించి కోర్టులో నమోదైన విడాకుల కేసుపై కూడ విచారణ కొనసాగుతోంది. అయితే భార్యతో ఎడబాటును తట్టుకోలేని మణికందన్ అనూహ్యమైన నిర్ణయానికి వచ్చాడు. భార్యను ఎలాగైన కాపురానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అత్తారింటికి చేరాడు. ఇందులో భాగంగానే తన భార్యను కాపురానికి పంపకపోతే తన మెడలో బాంబులు వేసుకుని చచ్చిపోతానంటూ బెదిరించినట్టు తెలుస్తోంది.