కుమార్తె బీఎస్సీ చివరి సంవత్సరం: ఫీజు కట్టలేని తండ్రి ఏం చేశాడంటే, దేవాలయంలో !
కాలేజ్ లో బీఎస్సీ చదువుతున్న కుమార్తె ఫీజు కట్టడానికి ఆర్థికస్థోమత లేని ఓ తండ్రి చివరికి అవమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో జరిగింది.
మైసూరు: కాలేజ్ లో బీఎస్సీ చదువుతున్న కుమార్తె ఫీజు కట్టడానికి ఆర్థికస్థోమత లేని ఓ తండ్రి చివరికి అవమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలో జరిగింది. మెట్టగేహళ్ళిలో నివాసం ఉంటున్న గంగాధర్ (51) అనే ఆయన గురువారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గంగాధర్ కుమార్తె బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. మైసూరు నగరంలోని బృందావన్ లేఔట్ లోని శ్రీ గణపతి దేవాలయంలో గంగాధర్ ప్రసాదం తయారు చేసే చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. కాలేజ్ ప్రారంభం కావడంతో రూ.12,500 ఫీజు కట్టాలని కుమార్తె గంగాధర్ కు చెప్పింది. జూన్ 22వ తేది (గురువారం) చివరి రోజు అని గుర్తు చేసింది.
దేవాలయం ఆవరణంలోని ఓ చిన్న ఇంటిలోనే గంగాధర్ నివాసం ఉంటున్నాడు అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం గంగాధర్ భార్య చనిపోయింది. కుమార్తె ఫీజు చెల్లించలేని తాను ఉన్నా ఒక్కటే, చనిపోయినా ఒక్కటే అనుకున్నాడు.
గురువారం ఉదయం కుమార్తె కాలేజ్ కు వెళ్లిన వెంటనే దేవాలయం ఆవరణంలోని ఇంటిలోనే గంగాధర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు చలించిపోయారు. తల్లి అనారోగ్యంతో చనిపోవడం, తోడుగా ఉన్న తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థిని ఆర్తనాదాలు చేస్తోంది.