మంత్రికి కరోనా వైరస్ పాజిటివ్: సచివాలయంలో సమీక్షలతో బిజీ: బెంబేలెత్తుతోన్న అధికారులు
పాట్నా: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ స్థాయిలో చెలరేగిపోతోందో చెప్పడానికి మరో తాజా ఉదాహరణ ఇది. ఎలాంటి వారైనా..ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ వారి ఒంట్లో తిష్ట వేయక తప్పదనడానికి మరో సాక్ష్యం ఈ ఉదంతం. బిహార్లో చోటు చేసుకుంది. బిహార్ కేబినెట్ మంత్రి ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం తన స్వస్థలం కతిహార్లో హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. సరిగ్గా 48 గంటల కిందటే ఆయన సచివాలయంలో తన శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఇప్పుడదే అందరినీ బెంబేలెత్తిస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆయన. కతిహార్ జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం జనతాదళ్ (యునైటెడ్) ప్రభుత్వంతో పొత్తులో భాగంగా ఆయనకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేబినెట్లో బెర్త్ సంపాదించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో అమలు చేస్తోన్న లాక్డౌన్ కారణంగా సుమారు రెండున్నర నెలల పాటు ఆయన సచివాలయానికి వెళ్లలేదు.
రెండురోజుల కిందటే సచివాలయానికి వెళ్లారు. అధికారులో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఆయన అధికారులతో తన శాఖకు సంబంధించిన కార్యకలాపాలను సమీక్షించారు. ఇతర ఫైళ్లను పరిశీలించారు. అదే రోజు రాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ మరుసటి రోజే ఆయన కతిహార్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్లో ఉంటున్నారు. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.
మంత్రి కరోనా వైరస్ బారిన పడినట్లు తెలిసిన వెంటనే ఆయన శాఖకు సంబంధించిన అధికారులు ఉలిక్కిపడ్డారు. బెంబేలెత్తుతున్నారు. కరోనా వైరస్ పరీక్షలను చేయించుకుంటున్నారు. మరికొందరు ముందుజాగ్రత్త చర్యగా హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. సచివాలయంలో ఆయనను ఎవరెవరు కలిశారనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు. కొందరు సందర్శకులు, బీజేపీ నాయకులు ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. వారిని ట్రేసింగ్ చేసే పనిలో పడ్డారు అధికారులు.