సీన్ రివర్స్: మైనర్ ను పెళ్లి చేసుకున్న యువతి: కిడ్నాప్ చేసిందని కేసు !
మైసూరు: ప్రేమ గుడ్డిది అనే సామెతకు మరో ఊదాహరణ ఎదురైయ్యింది. తనకంటే ఐదేళ్లు తక్కువ వయస్సు ఉన్న మైనర్ (బాలుడు)ను వివాహం చేసుకున్న యువతికి ఇప్పుడు చట్టపరంగా చిక్కులు ఎదురైనాయి.
కర్ణాటకలోని మైసూరు నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారతీయ ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం పురుషుడికి 21 ఏళ్లు పూర్తి అయిన తరువాత పెళ్లి చెయ్యాలి. యువతికి 18 ఏళ్ల వయస్సు పూర్తి అయిన తరువాత వివాహం చెయ్యాలని చట్టం చెబుతోంది.
అంత కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి పెళ్లి చేస్తే చట్టపరంగా చిక్కులు ఎదురౌతాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మైసూరు నగరంలో పోలీసులకు తలనొప్పిగా తయారైయ్యింది. మైసూరు నగరంలోని మండిమొహల్లా ప్రాంతంలో 24 ఏళ్ల యువతి, 18 ఏళ్లు పూర్తి కాని మైనర్ (బాలుడు) నివాసం ఉంటున్నారు.
ఇద్దరూ ఒకే వీదిలో నివాసం ఉండటంతో ప్రేమలో పడ్డారని సమాచారం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే పెళ్లికి పెద్దలు నిరాకరిస్తారని భావించారు. అంతే మైసూరు నగరంలోని సయ్యాజీరావు సర్కిల్ లోని శ్రీ సత్యనారాయణస్వామి దేవాలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
మెడలో పూల దండలు వేసుకుని వెళ్లి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చారు. ఈ విషయంపై మండిపడిన బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడికి 18 ఏళ్లు పూర్తి కాలేదని, అతని వివాహం చట్ట ప్రకారం చెల్లదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కుమారుడిని కిడ్నాప్ చేసి మాయమాటలు చెప్పి ఆమె పెళ్లి చేసుకోందని పోలీసుల ముందు వాపోయారు. అయితే మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని ఆ యువతి పోలీసులతో వాదించింది.
తన కంటే ఐదేళ్లు తక్కువ వయస్సు ఉన్న కుర్రాడిని పెళ్లి చేసుకోన్న యువతి ఆమె చేసిన పనిని సమర్థించుకుంటోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఏం చెయ్యాలో తెలీక తలలు పట్టుకుని ఇరుకుటుంబ పెద్దలతో చర్చిస్తున్నారు.