మరో ఘోరం: ఆరేళ్ల హత్రాస్ బాలికపై రేప్..మృతి: బంధువుల ఇంట్లో..బాత్రూమ్లో: మైనర్ అరెస్ట్
లక్నో: హత్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతంతో అట్టుడికిపోతోన్న ఉత్తర ప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్రాస్కే చెందిన ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. అలీగఢ్లో నివసిస్తోన్న సమయంలో సమీప బంధువు ఒకరు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అతను కూడా మైనరే కావడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రెండువారాల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆ బాలిక సోమవారం సాయంత్రం మరణించింది. ఈ ఘటన బాలిక గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
హత్రాస్పై ప్రధాని..నోరు మెదపరేమీ?: యోగి సర్కార్ టార్గెట్లో మృతురాలి కుటుంబం: రాహుల్
హత్రాస్ జిల్లాలోని సదాబంద్ బ్లాక్ పరిధిలోని జఠోయ్ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కొద్దిరోజుల కిందట పిన్నితో కలిసి అలీగఢ్ జిల్లాలోని ఇగ్లస్లో గల బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ బాలికకు తల్లి లేదు. మూడేళ్ల కిందట చనిపోయింది. ప్రస్తుతం ఆ బాలిక పిన్నితో కలిసి నివసిస్తోంది. ఆమెతో కలిసి ఇగ్లస్లోని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ కిరాతక ఘటన చోటు చేసుకుంది. ఆమె బంధువుల కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు.
ఎవరికైనా చెబితే హతమారుస్తానంటూ బెదిరించాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన అనంతరం బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. నిందితుడి తరఫు కుటుంబ సభ్యులు ఆ బాాలికను బాత్రూమ్లో నిర్బంధించారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆగ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక మరణించింది. దీనితో కుటుంబ సభ్యులు, ఇగ్లస్ గ్రామస్తులు భగ్గుమన్నారు. ఆందోళన చేపట్టారు. ఇగ్లస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు మైనర్ కావడంతో అతణ్ని జువైనల్ హోమ్కు తరలించినట్లు హత్రాస్ ఎస్పీ వినీత్ జైస్వాల్ తెలిపారు. ఈ ఘటన అనంతరం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో అదనపు బలగాలను మోహరింపజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని అన్నారు. బాలిక మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించినట్లు పేర్కొన్నారు.