వరకట్నం వేధింపులు, నిప్పంటించుకుని 18 నెలల చిన్నారి, తల్లి ఆత్మహత్య!
మైసూరు: భర్త కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేదిస్తున్నారని ఆరోపిస్తూ మహిళ తన 18 నెలల కుమారుడితో కలిసి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మైసూరు నగరంలో జరిగింది.
మైసూరు నగరంలోని మహదేవపురలో నివాసం ఉంటున్న గౌరమ్మ (27) అనే మహిళ కుమారుడు నియాల్ (18 నెలలు) ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అన్నారు. కేఆర్ పేట్ తాలుకా సోమనాథపురంకు చెందిన గౌరమ్మ, లోహిత్ ల వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో లోహిత్ వరకట్నం కింద నగదు, బంగారు నగలు తీసుకున్నాడని సమాచారం. మాలూరులోని ప్రైవేట్ పాఠశాలలో లోహిత్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నిత్యం వరకట్నం తీసుకురావాలని లోహిత్ భార్య గౌరమ్మను వేధింపులకు గురి చేశాడని సమాచారం.
ఈ విషయంలో జీవితంపై విరక్తి పెంచుకున్న గౌరమ్మ కిరోసిన్ తీసుకుని కుమారుడు నియాల్ మీద చల్లి ఆమె మీద పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. లోహిత్ సోదరుడు అరుణ్ వెళ్లి చూడగా గౌరమ్మ, ఆమె కుమారుడు నియాల్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి విద్యారణ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి విచారణ చేస్తున్నారు.