దేశంలో తొలి సారి ధైర్యం చేసిన ముస్లీం మహిళ, ప్రార్థనకు నాయకత్వం: వార్నింగ్!
తిరువనంతపురం: ఖురాన్, సున్నత్ సొసైటీ కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జామిదా దేశంలో ఏ ముస్లిం మహిళా చెయ్యని సాహసం చేశారు. ముస్లీం సోదరుల ప్రార్థనకు జామిదా నాయకత్వం వహించారు. ప్రార్థనలకు నాయకత్వం వహించిన జమిదాకు ఇప్పుడు అన్ని రకాలుగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
జమా ప్రార్థనలు
కేరళలోని మళప్పురం జిల్లాలోని వాండూర్లో ఉన్న ఖురాన్ సున్నత్ సొసైటీ మసీదులో శుక్రవారం మద్యాహ్నం ప్రార్థనకు జామిదా నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జామిదా ఖుట్బా నిర్వహించారు. వందలాధి మంది ముస్లీం సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు.
వివక్ష చూపిస్తున్నారు
ఈ సందర్బంగా జామిదా మాట్లాడుతూ ఇస్లాంలో మతపరమైన కార్యకలాపాలకు స్త్రీ, పురుషుల మధ్య భేదాలేవీ లేవని చెప్పారు. పురుష ముస్లింలు వివక్ష చూపిస్తున్నారని జామిదా ఆరోపించారు. ముస్లీం మహిళలు ప్రార్థనలకు నాయకత్వం వహించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇస్లాంను ధిక్కరించారు
జామిదా ఇస్లాం నిబంధనలను ధిక్కరించారని ఛాందసవాదులు ఆరోపిస్తున్నారు. తాను ఇస్లాంను ధిక్కరించినట్లు తనకు మసీదు కమిటీల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని జామిదా అంటున్నారు. సోషల్ మీడియాలో తన మీద ఆరోపణలు చేస్తున్నారని జామిదా వాపోతున్నారు.
అంత త్వరగా వస్తుందా?
తాను ఇస్లాంను నాశనం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారన్నారని జామిదా వాపోయారు. అయితే ఈ బెదిరింపులతో జామిదా వెనకడుగు వెయ్యడం లేదు. మార్పు అంత త్వరగా, తేలిగ్గా వస్తుందా అని జామిదా సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.