23 ఏళ్లుగా దుర్గా మాత సేవలో షేక్ సలీం
రాయ్ గడ్: మతం ఏదైనా దేవుడు ఒక్కడే అని ఓ ముస్లిం సోదరుడు నిరూపిస్తున్నాడు. గత 23 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం దగ్గర ఉండి దుర్గా దేవి నవరాత్రోత్సవం నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా సాటి ముస్లింలను ఈ ఉత్సవాలలో పాల్గోనేలా చేస్తున్నారు.
రాయ్ గడ్ లోని హండీ చౌక్ ప్రాంతంలో షేక్ సలీమ్ నియారియా (50) నివాసం ఉంటున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. 23 సంవత్సరాల క్రితం హండీ చౌక్ దుర్గా కమిటీ అనే పేరుతో నవరాత్రి దుర్గా దేవి ఉత్సవాలు నిర్వహించడం మొదలు పెట్టాడు.
మొత్తం 25 మంది ఈ కమిటిలో ఉన్నారు. అందులో ముగ్గురు ముస్లిం సోదరులు ఉన్నారు. 1992 నుంచి క్రమం తప్పకుండా దుర్గా దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కొందరు ముస్లిం కళాకారులతో కలిసి మండపాన్ని చక్కగా అలంకరిస్తున్నారు.
ప్రతి రోజు జరిగే అన్ని కార్యక్రమాలలో సలీం ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. పూజలు నిర్వహించడానికి వచ్చే మహిళా భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిదవ రోజు దుర్గా మాత నిమజ్జన కార్యక్రమంలోను సలీం కీలకపాత్ర పోషిస్తున్నాడు.
సాటి ముస్లింలు సైతం దుర్గా మాత ఉత్సవాలలో పాల్గోనే విధంగా ఈయన ప్రయత్నిస్తున్నారు. ఒక్క దుర్గా దేవి శరన్నవరాత్రుల విషయంలోనే కాదు సలీం అన్ని మతాల కార్యక్రమాలలో పాల్గొంటున్నారని ఆయన సన్నిహితులు, స్థానికులు అంటున్నారు.