తల్లి కర్కశం : మధ్యహ్నాం జన్మనిచ్చింది... సాయంత్రం చంపివేసింది..
భర్తపై కోపాన్ని అప్పుడే పుట్టిన బిడ్డపై చూపించింది ఓ తల్లి....! భర్త సరిగా పట్టించుకోవడం లేదని అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పదిహేడవ అంతస్తు నుండి విసిరి వేసింది. దీంతో పురిటిలోనే నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది.
భార్య భర్తల మధ్య ఎన్ని ఇబ్బందులు ఉన్నా... అది పిల్లల వరకు రానీయకుండా చూస్తారు. తల్లిదండ్రుల మధ్య పిల్లలు నలిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాని రోజులు మారుతున్న కొద్ది మానవ సంబంధాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. తన, మన భేదం లేకుండా మనుషులు వ్యవహరిస్తున్నారు. దీంతో కన్నవారినే కడతేరుస్తున్న సంఘటన ఆందోళనలను కల్గిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఓ తల్లి, తన భర్తపై ఉన్న కోపాన్ని శిశువుపై తీర్చుకున్న సంఘటన గురువారం ముంబయిలోలో చోటుచేసుకుంది.. ముంబయిలోని కందివళి ప్రాంతంలో జై భారత్ సోసైటీలో ఓ శిశువు మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే ఆ శిశువును కన్న తల్లే అపార్ట్మెంట్లోని 17వ అంతస్తు నుండి విసిరి వేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఇక చనిపోయిన శిశువుకు గురువారం మధ్యహ్నామే తన అపార్ట్మెంట్లోని బాత్రుంలో జన్మనిచ్చిందని పోలీసులు వివరించారు. అనంతరం సాయంత్రమే ప్లాట్లోని కిటికి గుండా విసిరివేసిందని చెప్పారు. అయితే ఇదంతా తనను భర్త సరిగా చూసుకోవడం లేదనే కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.
దీంతో పోలీసులు ఆమెతో పాటు, భర్త వాగ్మూలాన్ని కూడ తీసుకున్నారు. అయితే ఎలాంటీ కేసు వారిపై నమోదు చేయలేదని చెప్పారు. ఈ అంశంపై ఇతరులను కూడ విచారణ జరపనున్నట్టు పోలీసులు తెలిపారు.