పెళ్లయిన మరుసటి రోజే వధువు కిడ్నాప్.. గ్యాంగ్రేప్: అత్యంత పాశవికంగా.. !
లక్నో: మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పరాకాష్ఠగా చెప్పుకొనే ఉదంతం ఇది. పెళ్లయిన మరుసటి రోజే ఓ వధువును కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తరువాత కూడా ఈ కేసులో ఏ ఒక్కర్ని కూాడా పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. ఈ ఘటనపై బాధితురాలి బంధవులు, స్థానికులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన పట్ల ఉత్తర ప్రదేశ్ హోం మంత్రిత్వ శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.
ఉత్తర ప్రదేశ్లోని హాపుర్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఇది. ఈ నెల 17వ తేదీన బాధితురాలికి వివాహమైంది. ఆ మరుసటి రోజే ఆమె కనిపించకుండా పోయారు. బహిర్భూమికంటూ వెళ్లిన బాధితురాలు మళ్లీ వెనక్కి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు బాధితురాలి కోసం రోజంతా ఆమె కోసం గాలించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. దీనితో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా బాధితురాలి కోసం గాలించినప్పటికీ.. ఆమె ఆచూకీ కనిపించలేదు.
ఆదివారం ఉదయం ఆమె స్వగ్రామానికి సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో బాధితురాలు స్పృహ తప్పిన స్థితిలో కనిపించారు. ఆమెను గుర్తించిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి హాపుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శిస్తున్నారు.
ఈ ఘటనపై హోం మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. హాపుర్ డీఎస్పీ రాజేష్ సింగ్ను దర్యాప్తు అధికారిగా నియమించింది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని రాజేష్ సింగ్ వెల్లడించారు. ఇప్పటిదాకా ఈ కేసులో ఎవ్వర్నీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు ముమ్మరం చేశామని అన్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.