పబ్జ్ ఆడుతూ మృత్యువు ఒడిలోకి.. ఆట మోజులో నీళ్లు తాగబోయి..!
మొబైల్లో పబ్జ్ (ప్లేయర్ అనోన్ బ్యాటిల్ గ్రౌండ్) గేమ్ ఆడుతూ ఓ వ్యక్తి మృత్యువు బారిన పడ్డాడు. ఆట మోజులో తాను ఏం చేస్తున్నాడో తెలియని మైకంలో తన చావును తానే కొని తెచ్చికొన్నాడు. బుధవారం ఈ ఘటన స్వర్ణ జయంతి ట్రైన్లో చోటు చేసుకొన్నది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించడం గమనార్హం. ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే..
ట్రైన్లో పబ్జ్ ఆడుతూ..
గ్వాలియర్లోని చంద్రబాలి నకా ఝాన్సీ రోడ్కు చెందిన సౌరభ్ అనే వ్యక్తి తన స్నేహితుడు సంతోష్ కుమార్తో కలిసి ఢిల్లీకి ప్రయాణిస్తున్నాడు. తన బ్యాగులో కెమికల్స్ బాటిల్స్తో తీసుకెళ్తున్నాడు. ట్రైన్లో స్నేహితుడితో పబ్జ్ ఆడుతూ ఆటలో మునిగిపోయాడు. ఆటలో దీర్ఘంగా మునిగిపోయిన సౌరభ్ మంచి నీళ్లు తాగేందుకు వాటర్ బాటిల్ కోసం బ్యాగ్లో చేయిపెట్టాడు. అయితే వాటర్ బాటిల్కు బదులు.. కెమికల్ బాటిల్ తీసుకొని తాగేయడం జరిగింది. సౌరభ్ ఏం చేశాడో తెలుసుకొనే లోపే కెమికల్ వాటర్ కడుపులోకి వెళ్లాయి అని సంతోష్ వెల్లడించారు.
వైద్యలు అందుబాటులో లేకపోవడంతో
కెమికల్ వాటర్ తాగినట్టు సౌరభ్ గుర్తించిన వెంటనే ట్రైన్ ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చైన్ లాగి ట్రైన్ నిలిపివేశారు. గార్డు దిగివచ్చి డాక్టర్ కోసం ప్రయత్నించగా.. ట్రైన్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల సమయానికి వైద్యం అందలేదు. దాంతో సౌరభ్ మృత్యువు బారిన పడ్డాడు అని పోలీసులు పేర్కొన్నారు.
చికిత్స జరగకపోవడం వల్ల
కెమికల్ వాటర్ తాగిన సౌరభ్ పరిస్థితి ఆందోళనకరంగా మారడం.. సమయానికి ప్రథమ చికిత్స జరగకపోవడం, వైద్య సదుపాయం అందకపోవడంతో ఆయన ట్రైన్లోనే మరణించాడు. ఆయన మృతదేహాన్ని ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో దించడం జరిగింది. అనంతరం మృతుడి శవాన్ని కుటుంబం సభ్యులకు అందించాం అని రైల్వే పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ట్రైన్లో వైద్యులు ఎక్కడ?
ట్రైన్లో డాక్టర్ గానీ, వైద్య సిబ్బంది గానీ అందుబాటులో ఉంటే సౌరభ్ బతకడానికి అవకాశం ఉండేది. రైల్వే మంత్రి ఆదేశించినా రైలులో డాక్టర్ లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా సమయాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారనే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
పబ్జ్, బ్లూ వేల్ గేమ్ ఆటలను నిషేధించాలి
పబ్జ్, బ్లూ వేల్ గేమ్ లాంటి మొబైల్ గేమ్స్ వల్ల అనేక మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లిన సందర్బాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ప్రమాదకరమైన గేమ్స్ను నిషేధించాలనే అభిప్రాయాన్ని సామాజిక కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇలాంటి ఆటలకు పిల్లలను దూరంగా పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.