జేడీయూ లక్ష్యంగా ఆర్జేడీ అభ్యర్థుల పోటీ: బీజేపీకి కలిసి రానుందా?
పాట్నా: ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. కొన్ని పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు షాకివ్వగా.. మరికొన్ని పార్టీలు ఆర్జేడీ నాయకత్వంలోని మహాగఠబంధన్ కూటమికి షాకిచ్చాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థులను ఓడించడమే కీలకమని డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, 2015లో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాగఠబంధన్ ఆధ్వర్యంలో ఆర్జేడీ 101 స్థానాల్లో పోటీ చేసింది. 80 స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం 144 నియోజకవర్గాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. అంతేగాక, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అభ్యర్థులపైనే ఆర్జేడీ ఎక్కువగా అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం.
జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. వాటిలో 77 స్థానాల్లో ఆర్జేడీతో తలపడనుంది. దీంతో ఆ స్థానాల్లో జేడీయూకు ఆర్జేడీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. కాగా, 38 స్థానాల్లో జేడీయూ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. ఎన్డీఏ సీట్ల పంపకాల ప్రకారం బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో 51 స్థానాల్లో ఆర్జేడీతో తలపడాల్సి ఉంటుంది. ఇక మరో 59 స్థానాల్లో బీజేపీ గెలుపు సునాయాసమేనని తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఆధ్వర్యంలోని హిందుస్థాన్ అవామీ మోర్చ(సెక్యూలర్) పార్టీ పోటీ చేస్తున్న ఐదు స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)పార్టీ 11 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందని, ఇది ఆ పార్టీకి సానుకూలాంశమని ఆర్జేడీ చెబుతోంది. గత ఎన్నికల్లో బీజేపీనే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీగా ఉందన్నారు.
మహగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అని, ఈసారి ఎన్నికల్లో తమ కూటమిదే విజయమని ఓ ఆర్జేడీ నేత అన్నారు. చాలా స్థానాల్లో 2000-5000 ఓట్ల మార్జిన్ తో సీట్ల గెలుపు ఉంటుందని తెలిపారు.
ఇక ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ బహిరంగంగానే బీజేపీకి మద్దతు పలుకుతూ.. జేడీయూను విమర్శిస్తున్నారు. ఎల్జేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో నిలబడేందుకు కొందరు బీజేపీ నాయకులు అంగీకరించకపోవడంపై నితీష్ కుమార్ అసంతపృప్తి వ్యక్తం చేశారు.
అయితే, బీజేపీ మాత్రం జేడీయూకు తమ కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమారే సీఎం అని ఇప్పటికే స్పష్టం చేసింది. చిరాగ్ పాశ్వాన్ అనవసరంగా ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ఆర్జేడీ ఎన్ని ప్రణాళికలు వేసినా నితీష్ కుమార్ వైపే ప్రజలు ఉన్నారని జేడీయూ వ్యాఖ్యానించింది.