కిడ్నాప్ చేసి కారులో విద్యార్థిని మీద రేప్
బెంగళూరు: స్కూల్ దగ్గరకు వెళ్లిన యువకుడు 10వ తరగతి చదువుతున్న బాలికను నమ్మించి తీసుకు వెళ్లి తరువాత కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని నెలమంగల సమీపంలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మాగడిలో 16 సంవత్సరాల బాలిక 10వ తరగతి చదువుతున్నది. కుణిగల్ తాలుకా హెబ్బూరు సమీపంలోని చిక్కాపుర గ్రామంలో నివాసం ఉంటున్న ఒక రాజకీయ నాయకుడి కుమారుడు గిరీష్ బాలికకు పరిచయం ఉన్నాడు. సోమవారం సాయంత్రం గిరీష్ ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో స్కూల్ దగ్గరకు వెళ్లారు.
తరువాత బాలికను ఇంటి దగ్గర వదిలి పెడుతామని నమ్మించారు. మార్గం మధ్యలో కారును బెంగళూరు-ముంబై జాతీయ రహదారి వైపు మళ్లించారు. ఆ సమయంలో బాలిక ఎదురు తిరిగింది. కారు తీసుకు వెళ్లి నెలమంగల సమీపంలోని జాతీయ రహదారి మీద నిలిపివేశారు.
కారు రిపేర్ అయ్యిందని చెప్పిన గిరీష్ మెకానిక్ ను తీసుకురావాలని ఇద్దరు స్నేహితులను అక్కడి నుండి పంపించాడు. తరువాత కారులోనే బాలిక మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెప్పరాదని బెదిరించి బాలికను ఇంటి సమీపంలో వదిలి పెట్టారు.
విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించి గిరీష్ ను అరెస్టు చేశామని, అతని ఇద్దరి స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.