ఎస్కేప్: ఎమ్మెల్యే ఇంటి దగ్గర బాంబు పేలుడు
ఇంపాల్: మణిపూర్ లో ఓ శాసన సభ్యుడి ఇంటి గేటు దగ్గర బాంబు పేలుడు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ శాసన సభ్యుడిని అంతం చెయ్యడానికి ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో కెయిరో నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కరం తామర్ జిత్ సింగ్ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నివాసం ఉంటున్న ఇంటికి అతి సమీపంలో బుధవారం శక్తి వంతమైన బాంబు అమర్చి పేల్చి వేశారు.
ఆ సందర్బంలో కరం తామర్ జిత్ సింగ్ తో పాటు ఎవ్వరూ అటు వైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ఈ బాంబు పేలుడులో ఎవ్వరూ గాయపడలేదని పోలీసు అధికారులు అన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుని బాంబులు పెట్టారా, రాజకీయ కక్షలు ఉన్నాయా, తీవ్రవాదులు ఈ దాడికి ప్రయత్నించారా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత చర్యగా శాసన సభ్యుడి ఇంటి దగ్గర గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.