ఏమీ కానివాళ్ల కోసం... ఆ ఒక్కడి ఆరాటం... మరుభూమిలో నిత్యం శవాల మధ్య...
కరోనా కాలంలో మానవ సంబంధాల్లోని డొల్లతనం బయటపడుతోంది. కరోనాతో చనిపోతే.. కుటుంబ సభ్యులే శవాన్ని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోతున్న ఘటనలు చూస్తున్నాం. శవాలను తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది సమాచారమిచ్చినా ముందుకు రాని కుటుంబాలను చూస్తున్నాం. దీంతో ఎంతోమంది కరోనా బాధిత మృతులకు అనాథ శవాల్లా అంత్యక్రియలు జరుగుతున్నాయి.కొన్నిచోట్ల అంతిమ సంస్కారాలు సైతం సంస్కారహీనంగా జరుగుతున్న ఘటనలు కూడా బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి మాత్రం నిస్వార్థంగా ముందుకొచ్చి కరోనా మృతుల అంత్యక్రియల్లో పాలుపంచుకుంటున్నాడు. వాళ్లు తనకేమీ కాకపోయినా... ఇలా చేయడం వల్ల తనకేమీ రాకపోయినా... కేవలం సాటి మనుషులన్న స్పృహతో సామాజిక సేవ చేస్తున్నాడు.
ఎవరితను...
బెంగళూరుకు చెందిన మహమ్మద్ అజ్మతుల్లా ఓ పవర్ లిఫ్టర్. ఓ ఐటీ కంపెనీలో డీఎక్స్సీ టెక్నాలజీ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వారంలో ఐదు రోజులు ఆఫీస్కు వెళ్లే అజ్మత్... మిగతా రెండు రోజులు మాత్రం కరోనా మృతుల అంత్యక్రియల కోసం వెచ్చిస్తున్నాడు. తననెవరూ ఈ పని చేయమని చెప్పలేదని.. తనకు తానే ప్రతీ శని,ఆదివారాల్లో కరోనా మృతుల అంత్యక్రియల్లో పాలు పంచుకుంటున్నానని చెప్పాడు. 'లాక్ డౌన్ సమయంలో సహాయ చర్యలు అందించేందుకు నేను స్వచ్చందంగా పనిచేశాను. జూలైలో భారీ సంఖ్యలో జనం చనిపోతుండటం చూసి చలించిపోయాను. నాకు నేనుగా దయార్థ్ర హృదయంతో ఈ పనికి పూనుకున్నాను.' అని చెప్పుకొచ్చాడు.
అవన్నీ చూశాక...
కరోనా మృతులకు కనీసం సంస్కారవంతంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ మిషన్లో భాగమైనట్లు అజ్మత్ తెలిపాడు. కరోనా పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహల కారణంగా చాలాచోట్ల అంత్యక్రియలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పాడు. కొన్నిచోట్ల అంత్యక్రియలకు స్థానికులు అడ్డుపడుతుండగా... మరికొన్నిచోట్ల కుటుంబ సభ్యులు కూడా మృతదేహాల వద్దకు వచ్చేందుకు సుముఖత చూపట్లేదని చెప్పాడు. ఇవన్నీ చూశాక... కరోనా మృతుల అంత్యక్రియల కోసం స్వచ్చందంగా పనిచేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు తెలిపాడు.
అనేక సవాళ్లు...
కరోనా పేషెంట్ మృతి చెందితే.. ఆస్పత్రి నుంచి తీసుకురావడం మొదలు,శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించేంతవరకూ చాలా పెద్ద ప్రక్రియే ఉంటుందని అజ్మత్ తెలిపాడు. వలంటీర్లుగా కొన్నిసార్లు స్థానికుల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని... అలాంటప్పుడు అంత్యక్రియలు మరింత ఆలస్యమవుతాయని చెప్పాడు.'చావు అనేది తప్పించుకోలేనిది. కాబట్టి దాని గురించి బాధపడాల్సిన పనిలేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే నేనిందులో పాలుపంచుకుంటున్నాను. నాకూ ఓ కుటుంబం ఉంది.' అని చెప్పుకొచ్చాడు.
Recommended Video
కరోనా... చాలా గమ్మత్తయిన వ్యాధి..
ఇరవైల్లో ఉన్న యువకులు కూడా కరోనాతో చనిపోవడం తాను కళ్లారా చూశానని... అదే సమయంలో అప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా కరోనాను జయించిన వృద్దులను చూశానని అజ్మత్ చెప్పాడు. దీన్నిబట్టి కరోనా ఎంత గమ్మత్తయిన వ్యాధి అన్నది అర్థం చేసుకోవాలన్నాడు. అంత్యక్రియల కోసం ప్రతీరోజూ మృతదేహాలను మోసుకెళ్తుంటే ఉండే బాధ మాటల్లో చెప్పలేనిదన్నాడు. తాను చేస్తున్న పని పట్ల తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని... ఒక మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్న వేళ ఇలాంటి మిషన్లో భాగమవడం ఆత్మ సంతృప్తిని ఇస్తుందని చెప్పుకొచ్చాడు.