బెంగళూరు శివార్లలో చిరుత దాడి: నిండుగర్బిణి మృతి, ఇంటి నుంచి బయటకు!
బెంగళూరు: నిండుగర్బిణి మీద చిరుత దాడి చేసి దారుణంగా చంపేసిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని కనకపుర తాలుకాలోని గ్రామచౌకసంద్ర గ్రామంలో జరిగింది. చిరుత దాడిలో సుమా (25) అనే నిండు గర్బిణి ప్రాణాలు పోయాయి.
గురువారం ఉదయం ఇంటి సమీపంలో ఉన్న బాత్ రూం దగ్గరకు సుమా వెళ్లారు. ఆ సందర్బంలో ఒక్క సారిగా చిరుత దాడి చేసింది. సుమా గొంతును చిరుత కొరికివేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కేకలు వేశారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో చిరుత సమీపంలోని కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని అడవిలోకి వెళ్లిపోయింది. కనకపుర తాలుకాలో ప్రతినిత్యం చిరుత సంచరిస్తూ దాడి చేస్తుందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవి శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవి శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.