మంటగలిసిన మానవత్వం: కులాంతర వివాహం చేసుకున్నందుకు.. మరీ ఇంత కర్కశత్వమా?
కుల, మతాభిమానాలు ప్రజల మనుసులను మరింత కర్కశంగా మారుస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి సాయం చేసేందుకు గ్రామస్తులు నిరాకరించిన ఉదంతమిది.
భువనేశ్వర్ : కుల, మతాభిమానాలు ప్రజల మనుసులను మరింత కర్కశంగా మారుస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి సాయం చేసేందుకు గ్రామస్తులు నిరాకరించిన ఉదంతమిది.
వివరాల్లోకెళితే.. కొరాపుట్ జిల్లా మత్తిలిలోని కెందుగుడ గ్రామంలో రెండేళ్ల క్రితం త్రిలోచన హరిజన్ అనే యువకుడు, గౌరీకమార్ అనే యువతి ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో ఆ జంటను వెలివేస్తూ గ్రామస్తులు సహాయ నిరాకరణ అమలు చేశారు. కాదని ఎవరైనా సాయం చేస్తే.. వారికి కూడా ఇదేగతి పడుతుందని హుకూం జారీచేశారు.
దీంతో ఆ ప్రేమ జంట ఊరి పొలిమేరలో ఒక పాక ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. సదరు యువతి ప్రస్తుతం నిండు గర్భవతి కావడంతో పురిటినోప్పులు వచ్చాయి. కూలి పనిచేసే ఆమె భర్త.. ఆ సమయంలో ఇంట్లో లేడు.
పురిటినొప్పులు భరించలేక ఆ యువతి సమీపంలోనే ఉన్న బంధువులు, గ్రామస్తుల సాయం కోరింది. హృదయవిదారకంగా ఏడుస్తూ సాయం చేయాలని అర్థించింది. అయినా ఎవరి మనసు కరగలేదు. బంధువులతో సహా, గ్రామస్తులెవరూ ఆమెకు సాయం చేయలేదు. దీంతో దిక్కుతోచక అడవిలోకి వెళ్లిన ఆ యువతి.. ఓ వస్త్రం పరిచి దానిపై పడిపోయింది.
చివరికి అక్కడే ప్రసవించింది. పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డలకు కనీసం బొడ్డు కోసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అలా మూడు గంటల పాటు అడవిలో నిస్సహాయ స్థితిలో పడి ఉంది. అయితే ఎలాగో విషయం తెలుసుకున్న గ్రామంలోని ఆశావర్కర్ విజయలక్ష్మి త్రిపాఠి.. వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది. వారి బొడ్డు కోసి.. అంబులెన్స్ సాయంతో తల్లీ, పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాటి మనిషికి సాయం చేయలేని కులం, మతం ఎందుకని నిలదీస్తున్నారు నెటిజన్లు. రేపు ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక భవిష్యత్లో తన తల్లి అనుభవించిన వ్యధ గురించి తెలిస్తే.. సమాజాన్ని అసహ్యించుకోరా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.