నడిరోడ్డులో బస్సు బూడిద: 50 మంది విద్యార్థులు ! (వీడియో)
బెంగళూరులోని ప్రయివేట్ స్కూల్ విద్యార్థులు శనివారం శ్రీరంగపట్టణం దగ్గరకు విహారయాత్రకు వెలుతున్న సమయంలో బస్సులో మంటలు వ్యాపించిన ఘటన బెంగళూరు నగర శివారల్లోని చెన్నపట్టణ సమీపంలో జరిగింది.
బెంగళూరు/రామనగర: విహారయాత్రకు వెలుతున్న సమయంలో బస్సులో మంటలు వ్యాపించిన ఘటన బెంగళూరు నగర శివారల్లోని చెన్నపట్టణ సమీపంలో జరిగింది. మంటలు వ్యాపించిన వెంటనే బస్సు డ్రైవర్ ప్రాణాలకు తెగించి స్కూల్ టీచర్లతో కలిసి 50 మంది విద్యార్థులను కాపాడాడు.
బెంగళూరులోని జాలహళ్ళి క్రాస్ లో బీఇఎల్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 3వ తేది శనివారం ఉదయం 300 మంది విద్యార్థులు బస్సుల్లో శ్రీరంగపట్టణం దగ్గరకు విహారయాత్రకు బయలుదేరారు. బస్సుల్లో విద్యార్థులు ఉల్లాసంగా పాటలు పాడుకుంటూ వెలుతున్నారు.
బెంగళూరు-మైసూరు రహదారిలోని రామనగర సమీపంలో ఉన్న ముదగెరె సమీపంలో వెలుతున్న సమయంలో ఓ బస్సులో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన పిల్లలు కేకలు వేశారు.
వెంటనే బస్సు నిలిపిన డ్రైవర్ అదే వాహనంలో ఉన్న స్కూల్ సిబ్బందితో కలిసి అందులో ఉన్న విద్యార్థులు అందరినీ కిందకు దించేశారు. పిల్లలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వెంటనే పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నామని చెన్నపట్టణ గ్రామీణ పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదం వలన రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.