ఆన్లైన్ పాఠాలు చెబుతానని అశ్లీల చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడు- ప్రెస్ రివ్యూ
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు తన వృత్తికే కళంకం తెచ్చారు. ఆన్లైన్ పాఠాల పేరుతో ఆరో తరగతి విద్యార్థినులకు సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించడమే కాకుండా వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గోట్కూరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుందని సాక్షి ఒక కథనంలో తెలిపింది.
శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు చేరు కుని సదరు ఉపాధ్యాయుడిని నిర్బంధించారు.
గోట్కూరి పాఠశాలలో ఖదీర్ ఇంగ్లిష్ (స్కూల్ అసిస్టెంట్) ఉపాధ్యాయుడు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో శనివారం ఆరో తరగతి విద్యార్థినులు కొందరు హాజరయ్యారు. అయితే ఖదీర్ వారికి పాఠాలు చెప్పాల్సింది పోయి, తరగతి గదిలోనే తన సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించారు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారు.
ఈ విషయాన్ని చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో అదేరోజు వారు ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు ఖదీర్ను తల్లిదండ్రులు, గ్రామస్తులు నిలదీశారు.
అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తాంసి ఎస్సై శిరీష పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుడి ఫోన్ను సీజ్ చేశారు. ఖదీర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై విచారణ నిమిత్తం డీఈవో రవీందర్రెడ్డి ముగ్గురు సెక్టోరియల్ అధికారులను పాఠశాలకు పంపించా రు.
వారి నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయు డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఈ వార్తలో తెలిపారు.
- స్కూళ్ల ఫేస్బుక్ అకౌంట్లలోని ఫోటోలతో అశ్లీల 'మార్ఫింగ్' దందా
- కంప్యూటర్లో బాలికల 5 లక్షల అశ్లీల ఫొటోలు- థాయ్ మోడలింగ్ ఏజెన్సీ యజమాని అరెస్ట్
'వామన్రావు దంపతుల మరణ వాంగ్మూలాన్ని గెజిటెడ్ అధికారి ముందు ఎందుకు నమోదు చేయలేదు?'.. తెలంగాణ హై కోర్టు
న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులైన నలుగురి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను సోమవారం హైకోర్టు ప్రశ్నించినట్లు ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
పోలీసులు నమోదు చేయడం వల్ల అది ఏ మేరకు ఉపయోగపడుతుందని ప్రశ్నించింది. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా నిందితుల నుంచి మేజిస్ట్రేట్ ద్వారా వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని అడిగింది. ప్రత్యక్ష సాక్షులను ఎంతమందిని గుర్తించారు? ఎంతమంది వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ వద్ద తీసుకున్నారో చెప్పాలంది. వారికి రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది.
వామన్రావు దంపతులను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే ఎమ్మార్వో లేదంటే ఎవరైనా గెజిటెడ్ అధికారిని పిలిపించి మరణ వాంగ్మూలాన్ని ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. తీవ్రగాయాలతో ఉన్నప్పటికీ వామన్రావు మాట్లాడుతున్నారని, అలాంటి సమయంలో వాంగ్మూలం తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.
సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం న్యాయవాద దంపతుల జంటహత్యల కేసు విచారణ చేపట్టింది.
అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఫిబ్రవరి 25న దర్యాప్తు నివేదికను సీల్డ్కవర్లో సమర్పించినట్లు తెలిపారు. పోలీసులు కీలకమైన అన్ని సాక్ష్యాధారాలను సేకరించారన్నారు. దర్యాప్తు నివేదికను పరిశీలించిన ధర్మాసనం నిందితుల నేరాంగీకార వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ వద్ద ఎందుకు నమోదు చేయలేదని అడిగింది.
ఏజీ స్పందిస్తూ డ్రైవర్ స్టాలిన్, తాజుద్దీన్ చెప్పిన అంశాలను నమోదు చేశామని, 8 మంది ప్రయాణికులను గుర్తించామని చెప్పారు. ఇంకా కీలకమైన ఆధారాలను సేకరించాల్సి ఉందని చెప్పారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. సంఘటన స్థలంలో ఉన్న రెండు బస్సుల్లోని ఎంతమందిని గుర్తించారు, ఎంతమంది వాంగ్మూలాలను తీసుకున్నారని ఆరా తీసింది.
బైక్ల మీద వెళ్లేవారు కూడా ఉన్నారని.. సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారా? అని ప్రశ్నించింది. నివేదికలో పేర్కొన్న సాక్షుల నుంచి కూడా వాంగ్మూలాలను సేకరించాలని సూచించినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.
గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది.. మూడు నెలల్లో రూ.225 పెంపు
చమురు కంపెనీలు వంట గ్యాస్ సిలిండర్ ధరను మరో రూ.25 పెంచేశాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల ఇండ్లల్లో వినియోగించే సిలిండర్ (ఉజ్వల పథకం కింద వచ్చే సబ్సిడీతో కలిపి) ధర రూ.819కు పెరిగిందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో పేర్కొంది.
హైదరాబాద్లో రూ.871.50కు చేరుకున్నది. అలాగే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మరో రూ.95 పెరిగి రూ.1,614కు చేరింది. నెలరోజుల వ్యవధిలో సిలిండర్ ధర రూ.125 పెరుగడం గమనార్హం. గత నెల 4న చమురు సంస్థలు ఒక్కో సిలిండర్పై రూ.25 పెంచగా.. 15న మరో రూ.50ను వడ్డించాయి. 25న మరో 25 రూపాయలను పెంచాయి. తాజాగా మరో రూ.25ను పెంచాయి.
ఇండ్లల్లో వినియోగించే సిలిండర్ ధరలు గత మూడు నెలల కాలంలో విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఒక్కో సిలిండర్ ధర రూ.225 వరకు పెరుగడం సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. డిసెంబర్ 1, 2020న రూ.50 ను కంపెనీలు వడ్డించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.644కు చేరింది. ఆ తర్వాత ఐదు దఫాల్లో ధరలను పెంచడంతో ప్రస్తుతం ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.819కు చేరింది.
మోదీ సర్కార్ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సమయంలో (జూన్, 2014లో) 14.2 కిలోల సిలిండర్ ధర రూ.414 ఉండగా, రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో (జూన్, 2019లో) సిలిండర్ ధర రూ.500గా ఉన్నది. ప్రస్తుతం ఈ ధర రూ.871.50 కు చేరుకున్నది. అంటే మోదీ ఏడేండ్ల పాలనలో వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.457.50 పెరిగిందని ఈ వార్తలో రాశారు.
సొంతిల్లు కొనుక్కోవాలనుకునేవారికి శుభవార్త.. గృహ రుణాలపై వడ్డీ తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త చెప్పింది. గృహ రుణంపై వడ్డీ రేట్లను ఏకంగా 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు పేర్కొందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.
కనీస వడ్డీ రేటు 6.70 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఖరారు అవుతాయి. అంతేకాకుండా, ఫ్రాసెసింగ్ ఫీజు రద్దు కూడా కొనసాగుతుందని తెలిపింది. అయితే, ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
'కస్టమర్ల సిబిల్ స్కోర్, తీసుకోబోతున్న రుణ మొత్తం ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తాం. సమాయానికి చెల్లింపులు చేసే కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు అందాలనేదే మా లక్ష్యం’ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం ఎస్బీఐ 75 లక్షల లోపు రుణాలను 6.7 కసీన వడ్డీ రేటుతో అందిస్తోంది. రూ.75 లక్షలకు మించిన లోన్స్ కనీస వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. అయితే, యోనో యాప్ ద్వారా గృహ రుణాలు పొందేవారికి మరో ఐదు బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గుతుందని కూడా పేర్కొంది.
'మేము పారదర్శకత పాటిస్తాం. కాబట్టి వినియోగదారులు మమల్ని పూర్తిస్థాయిలో విశ్వసిస్తారు. మార్కెట్లో ఇంత కంటే తక్కువ వడ్డీరేటు లేదు’ అని ఎస్బీఐ రిటైల్ బిజినెస్ మ్యానేజింగ్ డైరెక్టర్ వ్యాఖ్యానించారని ఈ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- పతంజలి కరోనిల్: కరోనావైరస్కు విరుగుడు అనే ప్రచారంలో నిజమెంత?
- బ్రేక్ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా? మనం రోజూ తినే ఆహారంలో అదే ముఖ్యమైనదా?
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే..
- విజయనగరం: చనిపోయిన వృద్ధురాలికి పింఛన్ ఇచ్చిన గ్రామ వలంటీర్.. బతికే ఉన్నారంటున్న ఎంపీడీవో, చనిపోయారంటున్న కుటుంబసభ్యులు
- చైనా ఎందుకు ఏటా 600 కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తోంది?
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- బాయ్ ఫ్రెండ్ కోసం భార్య గొంతునులిమి చంపిన భర్త
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- ఎగ్జిట్ పోల్స్ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
- 'గాంధీ ఎప్పుడూ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ పేరు పొందే అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)