ఏఏపీతో పొత్త్తుపై ఎటూ తేల్చని కాంగ్రెస్ అగ్రనేతల మధ్య విబేధాలే కారణం
న్యూఢిల్లీ: సీనియర్ల మధ్య విభేధాలతో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీతో పొత్తుకు విషయంలో ఎటూ తేల్చలేకపోతోంది. ఆప్ తో దోస్తీ విషయంలో నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుండటంతో నిర్ణయాన్ని మరికొన్ని రోజుల పాటు వాయిదా వేసింది. ఆమ్ ఆద్మీ తో దోస్తానాకు చాకో మొగ్గుచూపడం, షీలా దీక్షిత్ ససేమిరా అంటుండటంతో అధిష్టానం అయోమయంలో పడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పొత్తు విషయాన్ని తేల్చే భారాన్ని తన భుజాన వేసుకున్నారు.
ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ, సిద్దరామయ్య రహస్య చర్చలు, మోడీ జిందాబాద్: టెక్కీల నినాదాలు !
బీజేపీని ఓడించేందుకు పొత్తు తప్పదంటున్న చాకో
బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది సీనియర్ నేత చాకో అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలో బీజేపీకి 35 శాతం మంది ఓటర్ల మద్దతున్నట్లు తేలడం, ఆప్ వైపు 28, కాంగ్రెస్ వైపు కేవలం 22శాతం ఓటర్లు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టం కావడంతో చాకో ఆప్ తో దోస్తానాకు పట్టుబడుతున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
ఆప్ తో దోస్తానా వద్దంటున్న షీలా
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ కి స్నేహహస్తం అందించాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ చీఫ్ షీలా దీక్షిత్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం సరికాదని అంటున్నారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ తో పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారుతుందన్నది షీలా అభిప్రాయం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీనే ప్రధాన శత్రువైనందున పొత్తు జోలికి పోవద్దని హైకమాండ్ ముందు షీలా వాదన వినిపించారు.
ఏఏపీ, కాంగ్రెస్ పొత్తు కోసం శరద్ పవార్ మంత్రాంగం
కాంగ్రెస్, ఏఏపీ పొత్తు విషయంలో సీనియర్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో యూపీఏ మిత్రపక్షమైన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ రంగంలోకి దిగారు. తొలుత కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తో పాటు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కేజ్రీవాల్ తో కలిసి పోటీ చేసేందుకు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు సుముఖంగా లేరన్న విషయాన్ని రాహుల్ గాంధీ శరద్ పవార్ తో చెప్పారు. అనంతరం ఏఏపీ నేత సంజయ్ సింగ్ తో సమావేశమైన పవార్ ఈ అంశంపై చర్చించారు.
పొత్తుపై నిర్ణయం వాయిదా
శరద్ పవార్ జరిపిన మంత్రాంగం అనంతరం ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్ తన నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమై ఏఏపీతో పొత్తు అంశంపై చర్చించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి లోబడి పనిచేయాలని భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - ఏఏపీ దోస్తానాపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశముంది.