కరోనా కాలంలో కొత్త స్టార్టప్ .. ఇక చావు తిప్పలకు చెక్ ..ఆన్ లైన్ ద్వారా అంత్యక్రియలు
కరోనా లాక్ డౌన్ సమయంలో ఉన్న స్టార్టప్ లు మనుగడ సాగించలేని పరిస్థితులలో ఉంటే కరోనా ఎఫెక్ట్ తో కొత్త స్టార్టప్ లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కరోనా లాక్ డౌన్ సమయములో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబసభ్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. లాక్ డౌన్ కారణంగా వాహనాలు దొరకకపోవడం,పురోహితుడు దొరకకపోవడం, అంత్యక్రియలకు సంబంధించిన సామాగ్రి లభించకపోవడం,ఇక అధికారుల నుండి అనుమతులు,మృతులను చూడ్డానికి వచ్చే బంధుమిత్రుల సామాజిక దూరం నిబంధనలు వెరసి ఎవరైనా మరణిస్తే అరిగోస పడుతున్నారు ప్రజలు. ఇక వారి కోసం రాబోతుంది ఒక కొత్త స్టార్టప్ .
corona India update : 2 లక్షలు దాటిన కరోనా కేసులు .. గత 16 రోజుల్లోనే లక్ష కేసులు
కరోనా ఉన్నన్ని రోజులు ఎవరైనా మరణిస్తే తిప్పలే
కరోనా భయం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది . మానవత్వం ఉన్నా , పక్కింటి వాళ్లకు కష్టం వచ్చిందంటే కూడా ఈ సమయంలో కాదు అని చెప్పే పరిస్థితి . ఇప్పటికే చాలా చోట్ల చాలా మంది న్యాచురల్ డెత్స్ సంభవించినా అయిన వాళ్ళు రాలేని పరిస్థితి . ఇక అంత్యక్రియలు ఈ సమయంలో నిర్వహించటం అంటే ఒక ప్రహసనమే . మహా ప్రస్థానమే. ఈ సమయంలో కరోనా కాలంలో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి కరోనా ఉన్నన్ని రోజులు ఇబ్బంది మాత్రం తప్పేలా లేదు .
అంత్యక్రియలు నిర్వహిస్తాం అంటూ కొత్త స్టార్టప్
ఇక ఈ నేపథ్యంలోనే పూణేలోని గురూజీ ఆన్ డిమాండ్ అనే స్టార్టప్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. మరణించిన వారి కుటుంబాలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అంత్యక్రియలకు వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు తామే చేస్తామని పేర్కొంది. మోక్షసేవ పేరుతో అంత్యక్రియలను నిర్వహించడమే కాకుండా మృతి చెందిన వ్యక్తి యొక్క మరణ ధ్రువీకరణ పత్రం పొందే వరకు కూడా తమ సహకారం అందిస్తామని ఈ స్టార్టప్ పేర్కొంటుంది.
పాడె దగ్గర నుండి అంత్యక్రియల వరకు అన్నిటికీ బాధ్యత
ముఖ్యంగా వీరు మరణాల సందర్భంలో ఎలాంటి సేవలు అందిస్తారు అంటే పాడెను ఏర్పాటు చేయడం,వాహనాన్ని సిద్ధం చేయడం,అంత్యక్రియలకు అవసరమైన సరుకులను పురోహితులను సమకూర్చడం,దహన సంస్కారాలకు అధికారుల వద్ద నుండి పాస్ తీసుకుని రావడం,పాడెను మోయడానికి వ్యక్తులను ఏర్పాటు చేయడం వంటి సేవలను అందిస్తామని స్టార్టప్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక మృతుడి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా అంత్యక్రియలు నిర్వహించడమే వారి ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు.
కరోనాతో ఆన్ లైన్ సేవల్లో పూజారులు
ఎవరైనా తమ ఇంట్లో ఏదైనా కర్మ కోసం ఒక పూజారి సేవలను కోరుకుంటే, వారు పోర్టల్కు వెళ్ళవచ్చు, మరియు ఆ వ్యక్తి ఇంటి నుండి ఐదు కిలోమీటర్ల పరిధిలో నివసించే పూజారి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక అవసరం అయిన వారు కోరుకుంటే పూజారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూజలు కూడా చేస్తారు. ఒక కర్మ చేయటానికి ఒక పూజారి వెళ్ళి చెయ్యటం అవసరం అయితే కస్టమర్ దగ్గరకు వెళ్ళే ముందు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. ఇక పూజారుల సేవలను పొందే వ్యాపారం ఇప్పటివరకు మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఆధారపడింది కానీ కరోనాతో ఆ పరిస్థితి మారింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో, ఇది సేవా పరిశ్రమగా మారి జిఎస్టి పరంగా రాష్ట్రానికి ఆదాయాన్ని ఆర్జించనుంది అని వారంటున్నారు.
కరోనా సమయంలో స్టార్ట్ అవుతున్న స్టార్టప్ .. ఎలా ఉంటుందో ?
వారి సమస్యకు సులువుగా పరిష్కార మార్గం చూపటమే తమ ఉద్దేశమని వారంటున్నారు. ఇక ఈ నెలాఖరులోగా ఈ స్టార్టప్ తమ సేవలను మొదలు పెడుతుందని వారు చెబుతున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఎవరైనా చనిపోతే ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ అవుతున్న ఈ కొత్త ఆన్లైన్ స్టార్టప్ ఏ మేరకు మృతుల కుటుంబాల అవసరాలు తీరుస్తుందో, ఏ మేరకు సేవలను అందించటంలో సక్సెస్ అవుతుందో అనేది తెలియాల్సి ఉంది.