ఢిల్లీలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు అరెస్టు
ఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల సానుభూతి పరుడిని ఢిల్లీలో అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. భారత్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల సానుభూతి పరులకు ఇతను నగదు సహాయం చేస్తున్నాడని వెలుగు చూసింది.
అంతే కాకుండ ఇతను సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓ వర్గంలోని యువతను ఇతను రెచ్చగొడుతున్నాడు.
తరువాత వారిని ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షిస్తున్నాడని విచారణ చేస్తున్న అధికారులు చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ సానుభూతి పరులు దాడులు చేసే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.
వివిధ ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ తో లింక్ పెట్టుకున్న వారిని అధికారులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఢిల్లీలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సానుభూతి పరుడిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.