తంజావూరులో అమ్మకు ఆలయం: పూజలు చేస్తున్న అభిమాని..
అన్నాడీఎంకె పార్టీకి చెందిన స్వామినాథన్ అనే కౌన్సిలర్ తన ఆరాధ్య నేత జయలలిత కోసం తంజావూరులో ఓ ఆలయాన్ని నిర్మించాడు.
చెన్నై: తమిళ ప్రజల ఆరాధ్య నేత, దివంగత సీఎం జయలలితకు తంజావూరులో ఆలయం నిర్మించారు. అమ్మ పట్ల విపరీతమైన అభిమానం కనబరిచే తంజావూరు వాసి, 18వ వార్డు అన్నాడీఎంకే కౌన్సిలర్ స్వామినాధన్ అమ్మ కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడు.
అమ్మ మరణంతో తీవ్రంగా కలత చెందిన స్వామినాధన్ అమ్మ మరణ వార్త విన్న క్షణం నుంచే ఆమె కోసం ఏమైనా చేయాలని భావించాడు. ఆలోచన రావడమే ఆలస్యం అమ్మ కోసం ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే రూ. 2లక్షల వ్యయంతో జయ ఆలయనిర్మాణపు పనులు చేపట్టి కేవలం ఐదు రోజుల్లోనే ఆలయ నిర్మాణం పూర్తి చేయించాడు.

జయలలిత పేరును తెలియపరిచేలా.. 'పురట్చితలైవి అమ్మ ఆలయం' అని దానికి నామకరణం కూడా చేశాడు. 150చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయంలో జయ చిత్రపటంతో పాటు మాజీ సీఎంలు అన్నాదురై, ఎంజిఆర్ చిత్ర పటాలు పెట్టి స్వామినాథన్ పూజలు చేస్తున్నాడు.
అమ్మ మరణం తమలాంటి కార్యకర్తలకు తీరని లోటు అని స్వామినాధన్ అభిప్రాయపడ్డారు. తనలాంటి సాధారణ కార్యకర్తను గుర్తించి ఉన్నతస్థితికి చేరుకోవడానికి అమ్మ చేయూతనందించారని తెలిపారు. ప్రస్తుతానికి జయ చిత్ర పటానికి పూజలు చేస్తున్న స్వామినాధన్.. వీలైనంత త్వరలో అమ్మ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నట్టుగా తెలియజేశారు.












Click it and Unblock the Notifications