అలా చేస్తే జనాభా తగ్గుతుందన్న బాబా రాందేవ్
హరిద్వార్ : దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి జనాభా పెరుగుదల. ఈ విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనాను భారత్ త్వరలోనే బీట్ చేస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జనాభా నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం శూన్యం. తాజాగా యోగా గురు రామ్దేవ్ బాబా జనాభాను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు మద్యం తయారీ, అమ్మకం, విక్రయాల, గోవధపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
కొడుక్కి నరేంద్ర మోడీ పేరు.. ముస్లిం మహిళ సంచలన నిర్ణయం
జనాభా నియంత్రణకు చట్టం
జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రామ్దేవ్ బాబా సూచించారు. మరో 50ఏళ్లలో జనాభా 150కోట్లను మించకూడదని అన్నారు. అంతకు మించి జనాభా పెరిగితే ప్రభుత్వాలు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించలేవని అభిప్రాయపడ్డారు. ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్న ఆయన మూడో బిడ్డ పుడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడో బిడ్డకు ఓటు హక్కు కల్పించకుండా ఉండటంతో పారు వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని రామ్దేవ్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ది మూడో బిడ్డకు అందకుండా చూడాలని చెప్పారు. మతంతో సంబంధం లేకుండా సంతానం విషయంలో ప్రతి ఒక్కరూ నియంత్రణ పాటించాలని రామ్దేవ్ బాబా సూచించారు.
మద్యపాన నిషేధం
దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని బాబా రామ్దేవ్ డిమాండ్ చేశారు. ఇస్లామిక్ దేశాల్లో మద్యంపై నిషేధం ఉన్నప్పుడు భారత్లో అలాంటి చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. " ఇస్లామిక్ దేశాల్లోలాగే మన దేశంలోనూ మద్యం ఉత్పత్తి, అమ్మకం, విక్రయాలను బ్యాన్ చేయాలి. మన దేశం రుషులకు జన్మస్థలం. భారత్లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలి." అని అన్నారు
గోవధపై సంపూర్ణ నిషేధం
భారత్లో గోవధపై సంపూర్ణ నిషేధం విధించాలని బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. అప్పుడే ఆవుల అక్రమ తరలింపుదారులకు గో సంరక్షకులకు మధ్య ఘర్షణలు ఆగిపోతాయని అభిప్రాయపడ్డారు. మాంసం తినాలనుకునే వారు మరే ఇతర మాంసాన్నైనా తినొచ్చని సూచించారు.