సుప్రీంకోర్టును సంస్కరించాల్సిందే - స్వతంత్ర న్యాయవస్థకు 5 మార్గాలు - కాంగ్రెస్ నేత చిదంబరం సూచనలు
న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఇటీవలి కాలంలో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. అత్యున్నత స్థాయిలో భారత రాజ్యాంగానికి కాపలాదారుగా ఉండే సర్వోన్నత న్యాయస్థానంలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తద్వారా మాత్రమే న్యాయవ్యవస్థ స్వతంత్ర మరింత పెరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.
గడిచిన రెండు దశాబ్దాల్లో సబార్డినేట్ జ్యూడీషియరీ నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయస్థానాల పాత్ర, విధివిధానాలు, కార్యకలాపాల్లో గణనీయంగా మార్పులు వచ్చాయన్నది నిర్వివాదాంశమని, అయితే, అవన్నీరాజ్యాంగ పరిరక్షణకు, కోర్టుల స్వతంత్రతకు ఎంతమేరకు ఉపకరించాయన్నది ఆలోచించాల్సి ఉందని, ప్రస్తుత తరుణంలో సంస్కరణలు తప్పనిసరని చిదంబరం పేర్కొన్నారు. ''సుప్రీంకోర్టులో సంస్కరణకు ఇదే సమయం'' శీర్షికతో ప్రఖ్యాత 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' కోసం ఆదివారం ఆయన రాసిన అభిప్రాయం యథాతథంగా..
''సుప్రీంకోర్టును దగ్గరగా పరిశీలించే వాళ్లంతా కచ్చితంగా ఒక విషయాన్ని అంగీకరిస్తారు. గత రెండు దశాబ్దాలలో కోర్టు పాత్ర, విధులు, కార్యకలాపాల్లో చాలా మార్పులు వచ్చాయి. జడ్జిలకు కేసులు కేటాయించే తీరు, ప్రిసైడింగ్ జడ్జిలకు కేటాయించే కేసులు, బెంచ్ ల ఏర్పాటు, కోర్టు అధికార పరిధి విస్తరణ, కొన్ని తీర్పుల్లో న్యాయశాస్త్ర పునాదుల ఉల్లేఖన, కార్యనిర్వాహక అధికారాల కోత.. తదితర అంశాల్లో ఈ మర్పులను మనం స్పష్టంగా గమనించవచ్చు.
న్యాయ వ్యవస్థలో సంస్కరణల గురించి ఇదివరకు చాలా మంది నిపుణులు చాలా విషయాలను ప్రస్తావించారు. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వయంగా కోర్టులూ కొన్నింటిని అమలు చేశాయి. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, జడ్జిల సంఖ్య పెంపు, డిజిటలైజేషన్, కేసుల నిర్వహణ, తాజాగా వర్చువల్ కోర్టులు.. ఇవన్నీ సంస్కరణల్లో భాగమే. అయితే, అందరినీ కలవరపెట్టే కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. కింది నుంచి పైదాకా భారీగా పెండింగ్ కేసులు ఉండటం, జడ్జి పదవుల భర్తీలో తాత్సారం, ఇప్పటికే తీర్పు వచ్చిన కేసుల్లో బాధితులకు సరైన న్యాయం దక్కిందా? అనే అంశాలపై అసంతృప్తి నెలకొన్నమాట వాస్తవం.
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సంబంధించి కింది నుంచి పైదాకా భిన్నరకాల సమస్యలు, ఆందోళనలు నెలకొని ఉన్నాన్నా, ఈ వ్యాసంలో నేను ప్రధానంగా సుప్రీంకోర్టుపైనే ఫోకస్ పెట్టాను. ఎందుకంటే, మన దేశంలో మానవ, జంతుజాల, పర్యావరణానికి సంబంధించిన ప్రాథమిక హక్కుల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగానికి ప్రధాన కాపలాదారుగా ఉంది. కొన్ని భారీ సంస్కరణలు చేపడితే తప్ప జ్యూడిషియరీ ఇండెపెండెన్స్ సాధ్యంకాదని నేను విశ్వసిస్తున్నాను. అందుకోసం 5 మార్గాలను సూచిస్తాను.
సుప్రీం.. రాజ్యాంగ కోర్టుగా ఉండాలి
నా అభిప్రాయంలో సుప్రీంకోర్టును ఇప్పుడున్న పద్ధతిలో కాకుండా పూర్తి స్థాయి ‘రాజ్యాంగ న్యాయస్థానం'గా మలచాలి. అంటే, భారత రాజ్యాంగంపై వెల్లువెత్తే సందేహాలను, వ్యాఖ్యాలనాలకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే అది పరిష్కరించాలి. అరుదైన సందర్భాల్లో మాత్రమే జనబాహుళ్యానికి సంబంధించిన సమస్యలను విని, నిర్ణయాలు వెలువరించాలి. ఈ రాజ్యాంగ న్యాయస్థానంలో బెచ్ రూపంలో కాకుండా మొత్తం ఏడుగురు జడ్జిలు ఉండాలి. ఇక హైకోర్టుల నుంచి వచ్చే అప్పీళ్లు, ఫెడరల్ వ్యవస్థపై దాఖలయ్యే వివాదాలను పరిష్కరించడానికి ‘అప్పీలేట్ కోర్టు'లను ఏర్పాటు చేయాలి. ఒక్కో బెంచ్ లో ముగ్గురు జడ్జిలు ఉండేలా కోర్టుకు ఆరుగురు జడ్జిల చొప్పున మొత్తం ఐదు అప్పీల్ కోర్టులను ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టుకు ప్రస్తుతం 34 జడ్జిల కేటాయింపు ఉంది. నేను ప్రతిపాదించిన ‘కానిస్టిట్యూషనల్ కోర్టు', ‘అప్పీలేట్ కోర్టు'లకు మొత్తంగా 37 మంది జడ్జిలు సరిపోతారు.
‘మాస్టర్ ఆఫ్ ది రోస్టర్' వద్దు
సుప్రీంకోర్టులో ‘మాస్టర్ ఆఫ్ ది రోస్టర్'గా వ్యవహరించే చీఫ్ జస్టిసే ఆయా కేసుల్ని బెంచ్లకు అప్పగించే ప్రస్తుత విధానాన్ని తొలగించాలి. కొత్త విధానం(కానిస్టిట్యూషనల్ కోర్టు)లో బెంచ్ లు ఉండవు కాబట్టి ‘మాస్టర్ ఆఫ్ ది రోస్టర్' అవసరం లేదు. నిజానికి ఈ విధానంపై ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు రావడం మనం చూశాం. గతంలో జస్టిస్ కేఎన్ సింగ్ సీజేఐగా 18 రోజులే ఉన్నప్పటికీ పలు కీలక కేసుల్ని తన బెంచ్ కే కేటాయించుకుని తీర్పులు ఇవ్వడం, ఆయన రిటైరైన తర్వాత ఆ తీర్పులపై రివ్యూలు జరగడం తెలిసిందే. మరో సీజేఐ దీపక్ మిశ్రా.. తనపై దాఖలైన ఓ కేసును.. అసాధారణ రీతిలో తన బెంచ్ కే బదిలీ చేసుకున్నారు. తాజాగా సీజేఐగా రిటైరైన జస్టిస్ రంజన్ గొగోయ్.. తనపై దాఖలైన కేసుల్ని స్వయంగా(ముగ్గురు సభ్యుల బెంచ్) విచారించి, తీర్పు కాపీపై మాత్రం సంతకం చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. అందుచేత, మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని నేను ప్రతిపాదిస్తాను.
జనంలో గందరగోళం
బెంచ్(ధర్మాసనం)ల వారీగా కేసుల విచారణ చేపడుతున్నందున, సుప్రీంకోర్టు తీర్పుల్లోనే చట్టాలకు సంబంధించి అనిశ్చితి వ్యక్తమవుతుంటుంది. సుప్రీంకోర్టులోనే ఒక బెంచ్ ఇచ్చిన తీర్పును మరో విస్తృత బెంచ్ కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. తద్వారా ప్రజలు గందరగోళానికి గురవుతారు. ఏదేమైనా, భారతదేశంలో, ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం తీర్పులను అనుసరించడానికి నిరాకరించడం లేదా ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మునుపటి అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరుగుతుంది. 2013 నాటి భూసేకరణ, పునరావాస చట్టంలో పరిహారానికి సంబంధించిన క్లాజు(సెక్షన్ 24)పై భిన్న తీర్పులు వెలవడటం ఒక ఉదాహరణ. ఇలా బెంచ్ బెంచ్ కూ తీర్పులు మారుతుండటం.. కేసుల్ని వాదించే న్యాయవాదులను, వాటిని దాఖలు చేసే ప్రజలనూ అనిశ్చితిలో పడేలా చేస్తుంది.
మిగతా వ్యవస్థల తీరు మారాలి
కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు, వాటి న్యాయాధికారులు అన్ని వేళలా సుప్రీంకోర్టుకు అండగా నిలబడాలి. ఎటువంటి న్యాయశాస్త్ర ప్రాతిపదిక లేకుండా పూర్తిగా పరిపాలనా లేదా విధాన నిర్ణయాన్ని న్యాయపరంగా సమీక్షించటానికి ప్రయత్నం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ విధానం లేదా పరిపాలనా నిర్ణయం తప్పు అయితే, దానిని సరిదిద్దే ప్రదేశం పార్లమెంట్ లేదా అసెంబ్లీలో ఒటింగ్ మాత్రమేనని మనం గుర్తుంచుకోవాలి.
Recommended Video
మాజీ సీజేఐలకు పదవులు వద్దు
పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఆయా ప్రభుత్వాలు ‘రివార్డ్'ను అందజేసే అవకాశాన్ని పూర్తిగా తొలగించాలి. సుప్రీంకోర్టు నుంచి రిటైరైన జడ్జిలు తదుపరి ఎలాంటి రాజ్యాంగ పదవుల్లో చేరకుండా ఉండేలా, జీవితం భత్యాలు పొందేలా నిబంధనలు తీసుకురావాలి. ఇందుకోసం అయ్యే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. మొత్తంగా సుప్రీంకోర్టు మరింత స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందికాబట్టి, మనమంతా సంస్కరణల దిశగా ఆలోచనలు చేయాలి'' అని చిదంబరం ముక్తాయింపునిచ్చారు.