ప్రేమించినోడిని పెళ్లి చేసుకుందని.. కూతురిని ఊరేగిస్తూ చితక్కొట్టిన తల్లిదండ్రులు..!
భోపాల్ : నచ్చినోడిని కట్టుకుందని కన్నోళ్లే చితకబాదారు. ప్రేమించి పెళ్లి చేసుకుందని గొడ్డును బాదినట్లు బాదారు. అంతేకాదు ఆమెను ఊరేగిస్తూ చిత్ర హింసలు పెట్టిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ లోని అలీరాజ్పూర్ జిల్లా టెమచి గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం నాడు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన 19 ఏళ్ల యువతి ఓ యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఆ అబ్బాయిది వేరు కులం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అది నచ్చలేదు. ఆ క్రమంలో పెద్దలు తమ పెళ్లికి అంగీకరించబోరని ఆ ప్రేమ జంట దూరంగా వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. అయితే తమను కాదని మ్యారేజ్ చేసుకుంటారా అనే కోపంతో విచక్షణారహితంగా ప్రవర్తించారు.
లండన్లో కశ్మీర్ చిచ్చు.. భారత దౌత్య కార్యాలయంపై మరోసారి దాడి..!
తమ కూతురు ఇతర కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని కోపం పెంచుకున్నారు తల్లిదండ్రులు. అయితే ఆ యువతికి ఏవో మాటలు చెప్పి మొత్తానికి గ్రామానికి తీసుకొచ్చారు. ప్రేమ లేదు, తొక్కా లేదు అంటూ మందలించారు. అంతేకాదు ఇతర కులం అబ్బాయిని ఎలా మనువాడుతావంటూ నిలదీశారు. అయితే ఆమె ఎంత చెప్పినా వినకుండా కర్రలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా బాధితురాలిని ఊరేగిస్తూ ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు.
ఆ నేపథ్యంలో తనను ఏమీ చేయొద్దంటూ బతిమిలాడినా కూడా కనికరం చూపలేదు. తమలోని రాక్షసత్వాన్ని బయటపెట్టారు తల్లిదండ్రులు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి విచక్షణారహితంగా చితకబాదారు. అయితే స్థానికుడొకరు సెల్ఫోన్లో చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వీడియో కాస్తా పోలీసుల వరకు చేరడంతో బాధితురాలిని హింసించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అదలావుంటే ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండటం గమనార్హం.