మా ఊరి పేరు మార్చండి మహాప్రభో!
మహాసముంద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదో చిన్న గ్రామం. దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి. అయితే ఆ ఊరి పేరు ఇప్పుడు అక్కడి ప్రజలకు ఇబ్బందులు తెచ్చింది. దీంతో తమ గ్రామం పేరు మార్చాలంటూ వారు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. చివరకు సీఎం ఆఫీసులోనూ అర్జీ పెట్టుకున్నారు. అయినా ఫలితం లేకుండాపోవడంతో కొత్తగా ఎన్నికయ్యే నేతలైనా తమ ఇబ్బందిని దూరం చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.
బీజేపీ ఐటీ యోధుడు! 1114 వాట్సప్ గ్రూపులకు అడ్మిన్!
ఊరి పేరుతో ఇబ్బందులు
ఇంతకీ ఆ గ్రామస్థులు ఊరి పేరు ఎందుకు మార్చమంటున్నారు? దానివల్ల వారికి వచ్చిన ఇబ్బందులేంటి? అనే ప్రశ్నలకు ఆ పేరు వింటే చాలు జవాబు దొరుకుతుంది. ఛత్తీస్గఢ్ మహాసముంద్ నియోజకవర్గంలోని ఆ గ్రామం పేరు రాఫెల్. దేశంలో పెను రాజకీయ దుమారానికి దారితీసిన యుద్ధ విమానం పేరు ఆ ఊరి పేరు ఒకటే కావడం స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాఫెల్ డీల్లో జరిగిన అవినీతి, నెగిటివ్ వార్తలు వస్తుండటంతో పక్క ఊరి వారు రాఫెల్ గ్రామస్థులపై కామెంట్ చేస్తుండటాన్ని స్థానికులు అవమానంగా భావిస్తున్నారు.
హేళనగా మాట్లాడుతున్న పక్క గ్రామస్థులు
రాఫెల్ పేరు గురించి పొరుగూరి వారు హేళనగా మాట్లాడుతుండటంతో ఆ గ్రామస్థులు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాఫెల్ దర్యాప్తును ఎదుర్కోవాలంటూ ఇతర గ్రామస్థులు అవహేళన చేస్తుండటంతో వారంతా తమ ఊరి పేరు మార్చుకోవాలని డిసైడయ్యారు. ఇందుకోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించినా సీఎంను కలిసే అవకాశం లభించలేదు.
రాఫెల్లో మౌలిక వసతుల లేమి
రాఫెల్ వివాదంతో ఆ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నా అదే పేరున్న గ్రామాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడంలేదు. తాగు,సాగునీరు లాంటి కనీస మౌలిక వసతులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలను దత్తత తీసుకునే నేతలు తమ ఊరిని బాగుచేస్తే బాగుండని స్థానికులు కోరుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి గెలిచే అభ్యర్థులైనా తమ సమస్య తీర్చాలని రాఫెల్వాసులు కోరుకుంటున్నారు.