వరుడి దిమ్మతిరిగింది: పేచీకి దిగినందుకు ఊహించని షాక్ ఇచ్చిన వధువు!
అనుకున్న ముహుర్తానికి పెళ్లిళ్లు జరగడం మధ్య తరగతి కుటుంబాల్లో చాలా అరుదు. పనుల్లో జాప్యం, సమయానికి రావాల్సిన వారు రాకపోవడం.. ఇలా అనేక రకాల కారణాలతో చాలావరకు పెళ్లిళ్లు అనుకున్న ముహుర్తానికి జరగవు.
బెంగుళూరు: అనుకున్న ముహుర్తానికి పెళ్లిళ్లు జరగడం మధ్య తరగతి కుటుంబాల్లో చాలా అరుదు. పనుల్లో జాప్యం, సమయానికి రావాల్సిన వారు రాకపోవడం.. ఇలా అనేక రకాల కారణాలతో చాలావరకు పెళ్లిళ్లు అనుకున్న ముహుర్తానికి జరగవు.
వీటికి తోడు ఏర్పాట్ల విషయంలో వధువు తరుపువారు గనుక చిందులు తొక్కితే.. వారిని సముదాయించలేక వధువు తరుపువారికి తల ప్రాణం తోకకు వస్తుంది. తాజాగా ఇలాగే వ్యవహరించిన ఓ వరుడి కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. ఏకంగా పెళ్లే వద్దంటూ వధువు తెగేసి చెప్పడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది.
వరుడి ఫ్యామిలీ హైరానా:
బెంగుళూరులోని కోణనెకుంటెలో ఉన్న సౌదామిని కళ్యాణ మండపంలో నాగేంద్రప్రసాద్ అనే వరుడికి ఓ యువతితో వివాహ నిశ్చయమైంది. ఆదివారం నాడు వీరి పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుడి తరుపువారు చేసిన హైరానాతో వ్యవహారం బెడిసికొట్టింది.
భోజనం కోసం గొడవ:
తమ తరుపు బంధువులకు సరిపోయేంత భోజనం వండలేదని వరుడి తరుపువారు వధువు కుటుంబ సభ్యులతో పేచీకి దిగారు. అప్పటికీ.. మరోసారి వంట చేస్తామని వధువు కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా.. వారి ఆగ్రహం చల్లారలేదు. నిజానికి వరుడి తరుపువారు చెప్పిన సంఖ్య కన్నా ఎక్కువ మంది హాజరవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని వధువు కుటుంబ సభ్యులు వాదించినా.. వారి వాదనను పట్టించుకోలేదు.
పెళ్లే వద్దన్న వధువు:
ఇరు వర్గాల మధ్య అర్థరాత్రి వరకు ఇదే విషయంపై గొడవ జరిగింది. చివరకు వరుడి తరుపువారు మెత్తబడినా.. వధువు మాత్రం తనకు ఈ పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. పెళ్లికి ముందే ఇలా వ్యవహరించిన వారు ఇక పెళ్లయితే ఎలా ఉంటారోనన్న అనుమానం వ్యక్తం చేస్తూ పెళ్లి రద్దుచేయాల్సిందిగా పెళ్లి కుమార్తె స్పష్టం చేసింది.
వరుడికి షాక్ తప్పలేదు:
ఇరువర్గాలు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పడంతో.. వరుడి బంధువులకు గట్టి షాక్ తగిలినట్లైంది. కాగా, గతంలోను బెంగుళూరులో ఒక పెళ్లి ఇలాగే రద్దు కావడం గమనార్హం. వరుడి తరుపువారు మటన్ బిర్యానీ వండాలని పట్టుబట్టగా.. వధువు తరుపువారు మాత్రం చికెన్ బిర్యాని వడ్డించడంతో పెళ్లి రద్దయింది.