భర్తకు వివాహేతర సంబంధం తెలిసిందని ఆత్మహత్య
బెంగళూరు: కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం బహిర్గతం కావడంతో రాజనకుంట పోలీస్స్టేషన్ పరిధిలోని నాగదానసహళ్ళికి చెందిన శ్వేత ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో దాగదాసనహళ్ళిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది.
యలహంక, హోబళి నాగదానసహళ్ళి పీఎల్డీ బ్యాంకు మాజీ డైరెక్టర్ ఎన్డి జగదీష్ గత కొద్ది రోజులుగా రాఘవేంద్ర భార్య శ్వేతతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు.
కాగా, శ్వేత మొబైల్లో మాట్లాడుతుండగా రాఘవేంద్ర గుర్తించి ఎవరితో మాట్లాడుతున్నావంటూ గట్టిగా ప్రశ్నించాడు. దీంతో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయోనని భావించిన శ్వేత ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు జగదీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సందర్భంలో జగదీష్ ఇంటి ముందున్న వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో కేఎస్ఆర్పీ పోలీసులు భారీగా మోహరించారు. డీఎస్పీ కోనప్పరెడ్డి, ఇన్స్పెక్టర్ శివశంకర్లు పరిస్థితిని సమీక్షించారు.