జీవితంలో ఆనందం కరువు: భర్త, పిల్లలను చంపేసి, వైద్యురాలి బలవన్మరణం
ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వైద్యురాలు తన భర్త, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సంచలనం సృష్టించిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
భర్త, పిల్లలతో కలిసి.. అత్త ఎంత పిలిచినా...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సుష్మ రాణె(41) అనే మహిళ వైద్యురాలిగా విధులు నిర్వహిస్తుండగా, ఆమె భర్త ధీరజ్(42) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరు వారిద్దరి పిల్లల(ఒకరు 11ఏళ్లు, మరొకరు 5ఏళ్లు)తో కలిసి కొరాడి ప్రాంతంలోని ఓం నగర్లో నివాసం ఉంటున్నారు. వీరితోపాటే అనారోగ్యంతో బాధపడుతున్న ధీరజ్ తల్లి కూడా ఉంటున్నారు. ఈ క్రమంలో వేరే గదిలో ఉంటున్న వైద్యురాలి అత్త... బెడ్ రూంలో ఉన్న ధీరజ్, సుష్మాలను పిలిచారు. అయితే, ఎంతకూ వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
భర్త, పిల్లలను హత్య చేసి.. వైద్యురాలి బలవన్మరణం..
ఆ వెంటనే పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా.. వారంతా విగతజీవులుగా కనిపించారు. ధీరజ్ తోపాటు పిల్లల మృతదేహాలు బెడ్ మీద పడివుండగా, వైద్యురాలు సుష్మా మృతదేహం మాత్రం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలంలో రెండు సిరింజీలతోపాటు ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జీవితం ఆనందం లేకపోవడంతోనే.. ఈ దారుణం..
తన జీవితంలో ఆనందం లేనందువల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు సుష్మ తన సూసైడ్ నోట్లో పేర్కొంది. మొదట విషం కలిపిన ఆహారాన్ని భర్తతోపాటు పిల్లలకు తినిపించి, ఆ తర్వాత వారికి గుర్తుతెలియని ప్రమాదకర ఇంజెక్షన్ ఇచ్చి వారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఒకేసారి నలుగురు మరణించడం స్థానికంగా కలకలం రేపింది.